చిత్తూరు , క్రైమ్మిర్రర్: చిత్తూరు జిల్లాలోని పూతలపట్టు మండలం పి.కొత్తకోట రైల్వే బ్రిడ్జి సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంతో ఇద్దరు మహిళలు మృతి చెందిన ఘటన ఆ ప్రాంతంలో విషాదం నింపింది. ఆగి ఉన్న లారీని ఓ కారు బలంగా ఢీకొట్టింది. ప్రమాద సమయంలో కారులో ఎనిమిది మంది ప్రయాణిస్తున్నారు. ఇద్దరు మహిళలు మృతి చెందగా మిగిలిన వారు గాయపడ్డారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని గాయపడిన వారిని చికిత్స నిమిత్తం చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
అలాగే మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గురైన వారు తెలంగాణకు చెందిన వారుగా సమాచారం. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.