-
తెలుగు రాష్ట్రాల బిజెపి ఎంపీలకు ఛాన్స్
-
భారీగా ఆశావహులు
-
ఎవరి ప్రయత్నాల్లో వారు..
క్రైమ్ మిర్రర్, సెంట్రల్ డెస్క్: ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చాయి. భారతీయ జనతా పార్టీ అనుకున్నది సాధించింది. ప్రధానంగా పశ్చిమ బెంగాల్ పై కాషాయ జెండా ఎగిరింది. అస్సాంలో మరోసారి పట్టు నిలుపుకుంది. పుదుచ్చేరిలో మరోసారి అధికారంలోకి రాగలిగింది. కేరళలో సైతం మూడు అసెంబ్లీ స్థానాలతో గౌరవప్రదమైన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేసింది.
అయితే మిగతా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై ఇప్పుడు దృష్టి పెట్టింది భారతీయ జనతా పార్టీ. ఈ క్రమంలో కేంద్ర మంత్రివర్గ విస్తరణ చేపట్టి చాలా రాష్ట్రాలకు ప్రాతినిధ్యం కల్పించాలని నిర్ణయించింది. ఈనెల 16 తర్వాత కేంద్ర క్యాబినెట్ విస్తరించాలని ప్రధాని మోదీ నిర్ణయించారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఆశావహుల సంఖ్య పెరుగుతోంది.
ఏపీకి ఒక మంత్రి పదవి..
ఏపీ నుంచి కూటమిలో భాగంగా మూడు పార్లమెంటు స్థానాలను దక్కించుకుంది భారతీయ జనతా పార్టీ. పొత్తులో భాగంగా ఆరు పార్లమెంట్ స్థానాలకు పోటీ చేయగా.. మూడు స్థానాల్లో విజయం సాధించింది ఆ పార్టీ. అనకాపల్లి నుంచి సీఎం రమేష్, రాజమండ్రి నుంచి దగ్గుబాటి పురందేశ్వరి, నరసాపురం నుంచి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ బిజెపి తరఫున గెలిచారు.
అయితే అనూహ్యంగా ఆర్ఎస్ఎస్ అండదండలతో భూపతి రాజు శ్రీనివాస వర్మ కేంద్ర క్యాబినెట్లో చోటు దక్కించుకున్నారు. అయితే ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ జరిగితే దగ్గుబాటి పురందేశ్వరికి పదవి ఖాయమన్న ప్రచారం నడుస్తోంది. అయితే సీఎం రమేష్ కూడా ఆశావహుడిగా ఉన్నారు. ఆయనకు సైతం చాన్స్ ఇచ్చే పరిస్థితి కనిపిస్తోంది.
తెలంగాణకు రెండు..
తెలంగాణలో భారతీయ జనతా పార్టీ నుంచి ఎనిమిది మంది గెలిచారు. ఇద్దరినీ కేంద్ర క్యాబినెట్ లో తీసుకున్నారు. సికింద్రాబాద్ నుంచి గెలిచిన కిషన్ రెడ్డి తో పాటు కరీంనగర్ నుంచి గెలిచిన బండి సంజయ్ కు ఛాన్స్ దక్కింది. అయితే ఈటెల రాజేందర్ తో పాటు ధర్మపురి అరవింద్ వంటి వారు కూడా పదవులు ఆశిస్తున్నారు. మంత్రివర్గ విస్తరణలో ఛాన్స్ తప్పకుండా తెలంగాణకు లభించనుంది.
ఎందుకంటే 2028లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి తెలంగాణలో. కేంద్ర క్యాబినెట్ విస్తరణ జరిగితే రెండు మంత్రి పదవులు తెలంగాణకు కేటాయించడం ఖాయం అన్న టాక్ నడుస్తోంది. అయితే ఒక్క ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్ మాత్రమే కాదు.. మిగతా నలుగురు ఎంపీలు కూడా తమ ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. మరి బిజెపి హై కమాండ్ ఎంతవరకు పరిగణలోకి తీసుకుంటుందో చూడాలి.