హైదరాబాద్, క్రైమ్ మిర్రర్: ఒకప్పుడు దక్షిణాది సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా వెలుగొందిన సిమ్రాన్ తాజాగా బాలీవుడ్పై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారాయి. ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాలతో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న ఆమె, హిందీ చిత్ర పరిశ్రమలో నటీనటులకు సరైన గౌరవం ఉండదని సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా సౌత్ ఇండస్ట్రీ నుంచి వెళ్లే నటీనటులను బాలీవుడ్లో చిన్నచూపు చూస్తారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
దక్షిణాది నటులకు అక్కడ గౌరవం లేదు…!
ఒక ప్రముఖ మ్యాగజైన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సిమ్రాన్ మాట్లాడుతూ.. “దక్షిణాదిలో స్టార్ ఇమేజ్ ఉన్నా, బాలీవుడ్లో మాత్రం కొత్తవాళ్లలా ట్రీట్ చేస్తారు. అక్కడ కళాకారుల ప్రతిభ కంటే బేరాలు, షరతులకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు” అని అన్నారు. హోటల్ సదుపాయాలు, విమాన టికెట్లు, స్టాఫ్ ఖర్చులు వంటి విషయాల్లో కూడా అనవసర చర్చలు జరిపేవారని ఆమె వెల్లడించారు.
సిమ్రాన్ చెప్పిన ప్రకారం, బాలీవుడ్లో కమ్యూనికేషన్ కూడా చాలా అసౌకర్యంగా ఉండేదట. “ఒక నటిగా నాకు కావాల్సిన గౌరవం అక్కడ కనిపించలేదు. దక్షిణాది నటీనటులను తక్కువ చేసి చూడటం నన్ను బాధించింది. అందుకే చాలా హిందీ సినిమా అవకాశాలను నేను స్వయంగా వదులుకున్నాను” అని ఆమె స్పష్టం చేశారు.
సినిమాను కళగా భావించే నటీనటులకు గౌరవం ఎంతో ముఖ్యమని, కానీ బాలీవుడ్లో కొన్నిసార్లు అది కనిపించదని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొందరు ఆమె మాటలకు మద్దతు ఇస్తుండగా, మరికొందరు బాలీవుడ్ మొత్తం అలాంటిదని చెప్పడం సరైంది కాదని అభిప్రాయపడుతున్నారు.
దశాబ్దాల పాటు సౌత్లో స్టార్ హీరోయిన్గా కొనసాగిన సిమ్రాన్, తన డ్యాన్స్, నటనతో ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. ఇప్పుడు ఆమె చేసిన ఈ కామెంట్స్పై బాలీవుడ్ ప్రముఖులు ఎలా స్పందిస్తారో చూడాలి.