హైదరాబాద్, క్రైమ్ మిర్రర్: హైదరాబాద్ నగరంలో వరుసగా అగ్ని ప్రమాదాలు సంభవించడంతో ప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. దీంతో ప్రజలకు భయాందోళనలకు గురవుతున్నారు. తాజాగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, బాచుపల్లి పోలీసుస్టేషన్ పరిధిలోని నిజాంపేట్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ప్రమాదంలో సుమారు ఆరు ఫర్నిచర్ దుకాణాలు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. . సమాచారం అందగానే పోలీసులు, అగ్నిమాపక అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
ఆరు దుకాణాలు దగ్డం…తీవ్ర ఆస్తినష్టం…
నిజాంపేట్ ప్రధాన రహదారిపై ఉన్న ఫర్నిచర్ దుకాణాల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఫర్నిచర్ దుకాణాలు కావడంతో లోపల ఉన్న కలప, కుషన్లు, ఇతర కెమికల్ వస్తువుల కారణంగా మంటలు క్షణాల్లో ఇతర షాపులకు వ్యాపించాయి. ఈ ఘటనలో 6 ఫర్నిచర్ షాపులు మంటల్లో కాలిపోయాయి. ఒక్కో షాపులో సుమారు రూ.3 లక్షల విలువైన వస్తువులు ఉన్నట్లు బాధితులు తెలిపారు. సుమారు రూ.18 నుంచి రూ. 20 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగి ఉండవచ్చని అంచనా వేశారు. విషయం తెలిసిన వెంటనే ఫైర్ సిబ్బంది నాలుగు ఫైర్ ఇంజిన్లతో మంటలను ఆర్పివేశారు
స్థానికుల్లో పెరుగుతున్న ఆందోళన…
నిజాంపేట్ ప్రాంతంలో ఇలాంటి ఘటనలు జరగడం ఇదే మొదటిసారి కాదు. ఇటీవలే ఇదే ప్రాంతంలో మరో అగ్నిప్రమాదం చోటుచేసుకున్న విషయాన్ని స్థానికులు గుర్తు చేస్తున్నారు. వరుసగా జరుగుతున్న ఈ ప్రమాదాలు స్థానికులను భయాందోళనకు గురి చేస్తున్నాయి. వరుస ప్రమాదాలకు కారణం విద్యుత్ వ్యవస్థలో లోపాలా? లేక వ్యాపార సముదాయాల్లో భద్రతా నియమాలు పాటించకపోవడమా? అనే ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. అధికారులు సకాలంలో స్పందించి ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని నిజాంపేట్ వాసులు డిమాండ్ చేస్తున్నారు.