క్రైమ్ మిర్రర్ తెలంగాణ సినిమా బ్యూరో: ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ‘రాజా శివాజీ’ సినిమా విడుదలైన తర్వాత ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. మే 1న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం మంచి టాక్తో ముందుకు దూసుకెళ్తోంది. ఈ సినిమాలో హీరోగా నటిస్తూ, దర్శకత్వం కూడా వహించిన రితేష్ దేశ్ముఖ్ ఈ సక్సెస్పై ఆనందం వ్యక్తం చేశారు.
సినిమాకు ప్రేక్షకులు చూపిస్తున్న ప్రేమకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అదే సమయంలో ఒక ముఖ్యమైన విజ్ఞప్తి కూడా చేశారు. థియేటర్లలో సినిమా చూస్తున్నప్పుడు ఎవరూ వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయవద్దని రితేష్ కోరారు. ఈ విషయాన్ని ఆయన తన సోషల్ మీడియా ద్వారా ప్రత్యేకంగా చెప్పడం ఇప్పుడు వైరల్ అవుతోంది.
సీరియస్ వార్నింగ్..!
“మీ అందరికీ మా టీమ్ తరఫున ధన్యవాదాలు. మీరు సినిమాను ఇంతగా ఆదరిస్తుండటం మాకు ఆనందంగా ఉంది. కానీ ఒక అభ్యర్థన… దయచేసి థియేటర్లలో వీడియోలు తీసి ఆన్లైన్లో పోస్ట్ చేయవద్దు” అని రితేష్ తెలిపారు. ఆయన ఈ విజ్ఞప్తిని మరాఠీలో కూడా రాసి అభిమానులను కోరారు.
ఇటీవల కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను ప్రేక్షకులు మొబైల్లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ముఖ్యంగా సల్మాన్ ఖాన్ క్యామియో ఉన్న సీన్లు వైరల్ అవుతున్నాయి. ఈ కారణంగా సినిమా చూడాల్సిన అసలు అనుభవం తగ్గిపోతుందని, అలాగే సినిమా బిజినెస్పై ప్రభావం పడుతుందని రితేష్ అభిప్రాయపడ్డారు.
ఈ సినిమాలో అభిషేక్ బచ్చన్, జెనీలియా దేశ్ముఖ్, సంజయ్ దత్, మహేష్ మంజ్రేకర్ వంటి పలువురు ప్రముఖులు కీలక పాత్రల్లో నటించారు. ప్రత్యేకంగా సల్మాన్ ఖాన్ అతిథి పాత్ర ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. అలాగే రితేష్ కుమారుడు కూడా ఈ సినిమాతో నటుడిగా పరిచయం కావడం ప్రత్యేక ఆకర్షణగా మారింది.