బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్రావు కాంగ్రెస్ నాయకులపై లీగల్ నోటీసులు పంపించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామా రామ్మోహన్ చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు.
తను క్షుద్రపూజలు, తాంత్రిక పూజలు చేశానంటూ చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమని హరీశ్రావు స్పష్టం చేశారు. ప్రజల్లో తన ప్రతిష్టను దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని నోటీసుల్లో పేర్కొన్నారు. భక్తిశ్రద్ధలతో దేవాలయాలకు వెళ్లడం మన సంప్రదాయమని, దాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వక్రీకరించడం సరైంది కాదని విమర్శించారు.
ఈ వ్యాఖ్యలు భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని కూడా హరీశ్రావు ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్నందుకే తనపై ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని అన్నారు.
కాంగ్రెస్ నేతలు చేసిన ఆరోపణలను వెంటనే వెనక్కి తీసుకుని, అదే మీడియా వేదికల ద్వారా బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. సోషల్ మీడియా, వెబ్సైట్లు, ఇతర డిజిటల్, ప్రింట్ ప్లాట్ఫామ్స్ నుంచి సంబంధిత వీడియోలు, పోస్టులను తొలగించాలని కోరారు.
నిర్దిష్ట గడువులోగా క్షమాపణ చెప్పకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అవసరమైతే సివిల్, క్రిమినల్ కేసులతో పాటు పరువు నష్టం దావాలు కూడా వేస్తామని స్పష్టం చేశారు.
also read: టీచర్లకు టెట్ తప్పనిసరి… గడువు 2028 ఆగస్టు 31 వరకు పొడిగింపు
