ఢిల్లీ హైకోర్టు ఆన్ లైన్ విచారణ సందర్భంగా అనూహ్య ఘటన జరిగింది. వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా కేసు విచారణ జరుగుతున్న సమయంలో అకస్మాత్తుగా అశ్లీల వీడియోలు స్క్రీన్పై కనిపించడంతో అందరూ షాకయ్యాడు. ఈ ఘటన చీఫ్ జస్టిస్ ధర్మాసనం ముందుకు వచ్చిన కేసు సమయంలో చోటు చేసుకుంది.
విచారణ నిలిపివేసిన కోర్టు అధికారులు
ఈ అనూహ్య పరిణామంతో వెంటనే కోర్టు అధికారులు విచారణను నిలిపివేశారు. కొంతసేపటి తరువాత తిరిగి విచారణ ప్రారంభించినప్పటికీ, మరో రెండు సార్లు అదే విధంగా అశ్లీల దృశ్యాలు ప్రత్యక్షమయ్యాయి. పరిస్థితి మరింత అసౌకర్యంగా మారడంతో వెంటనే వర్చువల్ హియరింగ్ ను పూర్తిగా ఆపివేశారు. చివర్లో మీరు హ్యాక్ అయ్యారు అనే మెసేజ్ కూడా స్క్రీన్పై కనిపించడం ఆందోళనకు గురిచేసింది.
సైబర్ దాడిగా పోలీసుల అనుమానం
ఈ ఘటనపై పోలీసులు ప్రాథమికంగా సైబర్ దాడి జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. విచారణలో ఉపయోగించిన వీడియో కాన్ఫరెన్సింగ్ వ్యవస్థను లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. శ్రీధర్ సర్నోబత్, షిత్జీత్ సింగ్ అనే పేర్లతో లాగిన్ అయిన రెండు అకౌంట్స్ నుంచి ఈ అశ్లీల వీడియోలు ప్రసారమయ్యాయని గుర్తించారు. ఈ సంఘటన న్యాయవ్యవస్థలో వర్చువల్ విచారణల భద్రతపై కొత్తగా సందేహాలు రేకెత్తించింది. ఆన్లైన్ వేదికలను ఉపయోగిస్తున్న సమయంలో సైబర్ భద్రత ఎంత ముఖ్యమో మరోసారి స్పష్టమైంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.