Iran Issues Strong Warning to the US: అమెరికా- ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయి. ఇరాన్ నౌకాదళ కమాండర్ రియర్ అడ్మిరల్ షారమ్ ఇరానీ తాజాగా షాకింగ్ కామెంట్స్ చేశారు. త్వరలోనే శత్రు దేశాలపై సరికొత్త ఆయుధాన్ని ఎక్కుబెట్టబోతున్నట్లు చెప్పారు. ఆ ఆయుధం అమెరికాను భయపెట్టేలా ఉంటుందని హెచ్చరించారు. అయితే ఆ ఆయుధం ఏమిటి అనే వివరాలను వెల్లడించలేదు.
ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన ట్రంప్
ఇదిలా ఉండగా, హర్మూజ్ జలసంధిపై ఇరాన్ ప్రతిపాదించిన షరతులను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరస్కరించారు. దిగ్బంధనాన్ని ఎత్తివేస్తేనే హర్మూజ్ను తెరవాలని ఇరాన్ చెప్పినా, అమెరికా ఆ విషయంపై వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ఇరాన్ నుంచి హెచ్చరికలు మరింత గట్టిగా వినిపిస్తున్నాయి.
అమెరికా యుద్ధనౌకపై ఇరాన్ అటాక్
ఇరానీ మాట్లాడుతూ, తమ దళాలు అమెరికాకు చెందిన యుద్ధ నౌక యూఎస్ఎస్ అబ్రహాం లింకన్ పై క్షిపణులతో దాడి చేశాయని చెప్పారు. ఆ దాడి కారణంగా ఆ నౌక కొన్ని రోజులు పనిచేయలేకపోయిందన్నారు. అమెరికా విధించిన దిగ్బంధనం ఉన్నప్పటికీ తమ దేశానికి చెందిన కొన్ని నౌకలు ప్రయాణాలు కొనసాగిస్తున్నాయన్నారు. యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన వారి కోసం చివరి వరకు పోరాడతామని, శత్రువులు పశ్చాత్తాపం చెందే వరకు తమ దాడులు ఆగవని ఆయన స్పష్టం చేశారు.
మరోవైపు, ఇరాన్తో అణు ఒప్పందం కుదిరే వరకు ఆర్థిక దిగ్బంధనం కొనసాగుతుందని ట్రంప్ ప్రకటించారు. సైనిక చర్యల కంటే ఈ విధానం ప్రభావవంతంగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇరాన్ ప్రస్తుతం ఒత్తిడిలో ఉందని, చర్చలకు రావడానికి సిద్ధంగా ఉందని ట్రంప్ తెలిపారు.