No Compromise at 90: ముంబైకి చెందిన ఓ పరువు నష్టం కేసుపై బాంబే హైకోర్టు ఇటీవల వ్యాఖ్యలు చేసింది. జీవితాంత దశలో ఉన్న 90 ఏళ్ల వృద్ధురాలు రాజీకి ఒప్పుకోకుండా కేసును కొనసాగించాలనుకోవడాన్ని కోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. ఈ వ్యవహారాన్ని “ఈగో పోరాటం”గా అభివర్ణించింది.
అసలేం జరిగిందంటే?
తరిణిబెన్ దేశాయ్ అనే వృద్ధురాలు, శ్యాం కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ మధ్య 2015లో వివాదం ప్రారంభమైంది. తనకు మానసికంగా ఇబ్బంది కలిగించారని ఆరోపిస్తూ, రూ.20 కోట్ల నష్టపరిహారం కోరుతూ ఆమె 2017లో కోర్టును ఆశ్రయించారు. అయితే, 2018లో కోర్టు ఈ సమస్యను సర్దుబాటు చేసుకోవచ్చని, క్షమాపణలు చెప్పడం సరిపోతుందని సూచించింది. కానీ, ఆమె ఆ సూచనను అంగీకరించలేదు.
2046కు కేసు వాయిదా, ఆ తర్వాత యూటర్న్!
తాజాగా ఈ కేసు జస్టిస్ జితేంద్ర జైన్ ముందుకు వచ్చింది. ఇలాంటి కేసులు కోర్టు సమయాన్ని ఎక్కువగా తీసుకుంటున్నాయని, ఇతర ముఖ్యమైన కేసులకు అంతరాయం కలిగిస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో, ఈ కేసును 20 సంవత్సరాల పాటు వాయిదా వేసి, 2046లో విచారణకు పెట్టాలని ఆదేశించారు. అయితే, తరువాతి రోజు వృద్ధురాలి తరఫు న్యాయవాది చేసిన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని, కోర్టు తన నిర్ణయాన్ని మార్చుకుంది. కేసును త్వరలోనే, రానున్న జూలైలో విచారణకు తీసుకోవడానికి అంగీకరించింది. ఈ సంఘటన కోర్టులలో కేసుల పెండింగ్, వ్యక్తిగత భావోద్వేగాలు, న్యాయవ్యవస్థ సమయ వినియోగంపై చర్చకు దారితీసింది.