-
కాంగ్రెస్ అగ్రనాయకత్వం నమ్మకం
-
కేంద్ర బిజెపి పెద్దల పాలనా సహకారం
-
ఎమ్మెల్సీ పెండింగ్ ఫైల్ విషయంలో తెలంగాణ సీఎం సక్సెస్
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాజకీయాల్లో రేవంత్ రెడ్డి ఒక సంచలనం. అణచివేత నుంచి పుట్టుకొచ్చిన నాయకత్వం ఆయన. స్వల్ప కాలంలోనే తెలంగాణలో తనకంటూ ఒక ముద్ర చాటుకున్నారు. అసలు ముఖ్యమంత్రి అయిన తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయో నన్న ఆందోళనలు ఉండేవి. అటువంటి సమయంలోనే తనదైన శైలిలో అడుగులు వేస్తూ.. ప్రత్యర్థులను సైతం ఆశ్చర్యపరిచే రాజకీయ పరిణితి ప్రదర్శిస్తున్నారు. తాజాగా గవర్నర్ కోట ఎమ్మెల్సీల నియామకానికి రాజ్ భవన్ ఆమోదం ముద్ర పడడం రేవంత్ రెడ్డి సాధించిన వ్యూహాత్మక విజయం.
ఇటువంటి సంధి కాలంలో..
రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పాలిత ముఖ్యమంత్రి. కాంగ్రెస్ పార్టీ అంటేనే భారతీయ జనతా పార్టీ మండి పడిపోతుంది. అటువంటిది కాంగ్రెస్ సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి కేంద్రంలో బిజెపిని వ్యతిరేకిస్తూనే.. రాష్ట్ర ప్రయోజనాల విషయంలోనూ.. తన రాజకీయ నిర్ణయాల విషయంలోనూ బిజెపి నుంచి ఎలాంటి అడ్డంకులు రాకుండా చూసుకుంటున్నారంటే ఆయన పరిణితి సాధించినట్టే కదా. జాతీయస్థాయిలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి అత్యంత నమ్మకమైన ఫైర్ బ్రాండ్ గా ఎదిగారు. మోడీ ప్రభుత్వం పై ఆయన చేసే విమర్శలు ఢిల్లీ స్థాయిలో కూడా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇటువంటి సమయంలోనే తెలంగాణలో గవర్నర్ కోట ఎమ్మెల్సీల ఫైలును గడువు కంటే ముందే ఆమోదింప చేసుకోవడం అనేది చిన్న విషయం కాదు. ఒకవేళ బిజెపి కేంద్ర నాయకత్వం రేవంత్ రెడ్డిని ఇబ్బంది పెట్టాలని భావిస్తే ఈ ప్రక్రియ ముందుకి వెళ్ళేది కాదు. కానీ అలాంటిదేమీ జరగకపోవడంతో రేవంత్ ఢిల్లీ పరపతి కూడా పెరిగినట్లు అర్థమవుతోంది.
పాలనాపరమైన రిలేషన్స్..
రేవంత్ రెడ్డి తనలో ఉన్న రాజకీయ కోణమే కాదు.. కేంద్ర పెద్దలతో పాలనాపరమైన రిలేషన్స్ కొనసాగిస్తున్నారు అనేది ఈ పరిణామం ద్వారా తెలిసింది. అందర్నీ కలుపు కెళ్లే మనస్తత్వంతోనే కేంద్ర పెద్దలు ఆయన విషయంలో ప్రత్యేక భావనతో ఉన్నట్లు అర్థమవుతుంది. కేంద్ర ప్రభుత్వం నియమించిన, బిజెపి భావజాలం కలిగిన గవర్నర్తో పెండింగ్ లో ఉన్న నామినేటెడ్ పదవులను భర్తీ చేయించుకోవడం ఆయన రాజకీయ చాతుర్యానికి నిదర్శనం. రాజ్యాంగబద్ధమైన వ్యవస్థలతో ఘర్షణకు వెళ్లకుండా పనులు పూర్తి చేసుకోవడం అంత ఈజీ కాదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఎమ్మెల్సీల నియామకంతో రేవంత్ రెడ్డి ఒకే దెబ్బకు రెండు పిట్టలను కొట్టారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం నమ్మకాన్ని నిలబెడుతూనే.. కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మరీ సంక్లిష్ట పరిస్థితులను అధిగమించారు. కేవలం ఎమ్మెల్సీ పదవుల నియామకం కాదు కానీ.. రేవంత్ రెడ్డి రాజకీయ దౌత్యానికి లభించిన గుర్తింపు గానే భావించాలి.