•పుప్పాలగూడ టోల్ గేట్ వద్ద హోరెత్తిన కార్ల హారన్లు
•గంటల తరబడి ట్రాఫిక్ నిలిపివేతపై ప్రయాణికుల ఆగ్రహం
గండిపేట్,క్రైమ్ మిర్రర్:- తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనల కారణంగా ఔటర్ రింగ్ రోడ్డు పరిసర ప్రాంతాల్లో సామాన్య ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆదివారం పుప్పాలగూడ టోల్ గేట్ సమీపంలో పోలీసులు గంటకు పైగా వాహనాలను నిలిపివేయడంతో, ఆగ్రహించిన వాహనదారులు తమ కార్ల హారన్లను ఏకధాటిగా మోగిస్తూ వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు.
నార్సింగి, గచ్చిబౌలి, జనవాడ వంటి ప్రాంతాల్లోని కన్వెన్షన్ సెంటర్లలో జరిగే శుభకార్యాలకు, ప్రైవేట్ కార్యక్రమాలకు ముఖ్యమంత్రి తరచుగా రహదారి మార్గంలో ప్రయాణిస్తుండటమే ఈ సమస్యకు కారణమని ప్రజలు మండిపడుతున్నారు. అత్యవసర పనుల నిమిత్తం బయటకు వెళ్లే వారు, విమానా శ్రయానికి వెళ్లే ప్రయాణికులు ప్రతిరోజూ గంటల తరబడి ట్రాఫిక్లో చిక్కుకుపోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం పుప్పాలగూడ వద్ద పోలీసులు రహదారిని దిగ్బంధించడంతో వాహనదారులు పోలీసులను ప్రశ్నించారు. ఈ క్రమంలో పోలీసులకు, ప్రయాణికులకు మధ్య తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకుంది. ప్రశ్నించిన వారిని ‘లోపల వేస్తాం’ అంటూ పోలీసులు బెదిరించడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో విసిగిపోయిన వందలాది మంది వాహనదారులు రోడ్డుపైనే కార్లు నిలిపివేసి, సైరన్లతో నిరసన తెలుపుతూ ముఖ్య మంత్రి తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిత్యం ప్రజల మధ్య ఉండే ప్రజాప్రతినిధుల పర్యటనల వల్ల ప్రజలకే ఇబ్బంది కలగడం ఎంతవరకు సమంజసమని బాధితులు ప్రశ్నిస్తున్నారు. ముఖ్య మంత్రి పర్యటనల సమయంలో కనీసం సర్వీస్ రోడ్ల ద్వారా అయినా ప్రయాణికులను అనుమతించాలని, ప్రోటోకాల్ పేరుతో గంటల తరబడి రోడ్లను మూసివేయడం మానుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
సమ్మర్ హాలిడేస్.. తిరుమలకు పెరిగిన రద్దీ!
Electricity Demand: ఎండల ఎఫెక్ట్.. దేశంలో ఆల్టైమ్ హైకి విద్యుత్ డిమాండ్!