ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ముందస్తు డిపాజిట్ (EMD) ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో సైబర్ మోసగాళ్లు మళ్లీ రంగంలోకి దిగే అవకాశముందని సీపీ సజ్జనార్ హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా పేదల కోసం అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాల పేరుతో అమాయకులను లక్ష్యంగా చేసుకుని మోసాలు చేసే ప్రయత్నాలు పెరిగే ప్రమాదం ఉందని తెలిపారు.
ఇటీవల కొన్ని ప్రాంతాల్లో “రూ.10,000 చెల్లిస్తే మీకు ఇల్లు మంజూరు అవుతుంది” అంటూ ఫోన్ కాల్స్ వస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వ అధికారులమని చెప్పుకుంటూ, వెంటనే డబ్బులు చెల్లించకపోతే అవకాశం కోల్పోతారని భయపెట్టి మోసం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇలాంటి కాల్స్ను పూర్తిగా నిర్లక్ష్యం చేయాలని అధికారులు సూచిస్తున్నారు.
అలాగే వాట్సాప్, SMS ద్వారా వచ్చే అనుమానాస్పద లింకులు, ఫైళ్లను ఓపెన్ చేయకూడదు. ప్రభుత్వ వెబ్సైట్లలా కనిపించే నకిలీ సైట్లు రూపొందించి, వ్యక్తిగత వివరాలు, బ్యాంక్ సమాచారం దొంగిలించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అపరిచితుల సూచనలతో AnyDesk, TeamViewer వంటి యాప్లు డౌన్లోడ్ చేయడం కూడా ప్రమాదకరం.
ప్రభుత్వం ఎప్పుడూ OTP, UPI PIN, బ్యాంక్ వివరాలు అడగదని స్పష్టం చేస్తున్నారు. ఎవరికీ ఈ వివరాలు ఇవ్వకుండా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
ఒకవేళ మోసానికి గురైతే వెంటనే 1930 సైబర్ హెల్ప్లైన్కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలి. సమీప పోలీస్ స్టేషన్ను కూడా సంప్రదించడం ద్వారా నష్టాన్ని తగ్గించుకోవచ్చు.
also read: 2028 ఎన్నికల్లో పోటీకి దూరం… కీలక నిర్ణయం తీసుకున్న సిద్ధరామయ్య
