దేశంలో ఎండలు తీవ్రంగా పెరుగుతున్న నేపథ్యంలో విద్యుత్ వినియోగం కూడా గణనీయంగా పెరుగుతోంది. ముఖ్యంగా ఈ వేసవిలో ఉష్ణోగ్రతలు అధికంగా ఉండటంతో ప్రజలు ఎక్కువగా ఏసీలు, కూలర్లు ఉపయోగిస్తున్నారు. దీనివల్ల విద్యుత్ డిమాండ్ రోజురోజుకు కొత్త రికార్డులు సృష్టిస్తోంది.
252.1 గిగావాట్లకు చేరిన విద్యుత్ డిమాండ్
ప్రభుత్వానికి చెందిన గ్రిడ్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా వెల్లడించిన వివరాల ప్రకారం, ఏప్రిల్ 24న మధ్యాహ్నం 3.28 గంటలకు దేశంలో విద్యుత్ డిమాండ్ 252.1 గిగావాట్లకు చేరి ఇప్పటివరకు ఉన్న గరిష్ఠాన్ని దాటింది. ఇది దేశ చరిత్రలోనే అత్యధిక డిమాండ్గా నమోదైంది. అంతకుముందు 2024 మే 30న 249.9 గిగావాట్ల గరిష్ఠ డిమాండ్ నమోదైంది.
ఎండల ఎఫెక్ట్ తో..
ఈ ఏడాది ఎండలు మరింత తీవ్రంగా ఉంటాయని ఇండియన్ మెట్రోలాజికల్ డిపార్ట్ మెంట్ ఇప్పటికే హెచ్చరించింది. ఈ నేపథ్యంలో విద్యుత్ వినియోగం మరింత పెరిగే అవకాశముందని కేంద్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. ముఖ్యంగా ఈ వేసవిలో విద్యుత్ డిమాండ్ 271 గిగావాట్ల వరకు చేరవచ్చని భావిస్తున్నారు. ఇప్పటికే దేశంలోని అనేక ప్రాంతాల్లో తీవ్ర ఎండలు నమోదవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో విద్యుత్ వినియోగం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. గత ఏడాది ఎండలు కొంతమేర తక్కువగా ఉండటంతో ఏప్రిల్లో డిమాండ్ 235 గిగావాట్లకు చేరింది. అలాగే 2024లో గరిష్ఠంగా జూన్ 12న 242.8 గిగావాట్ల డిమాండ్ నమోదైంది.
ఇక ఈ ఏడాది ప్రారంభంలోనే, ముఖ్యంగా ఉత్తరాది మరియు ఈశాన్య ప్రాంతాల్లో చలి ప్రభావం కారణంగా జనవరి 9న విద్యుత్ డిమాండ్ 245 గిగావాట్లకు చేరింది. మొత్తంగా వాతావరణ మార్పులు, పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా విద్యుత్ వినియోగం సంవత్సరానికొకసారి పెరుగుతూనే ఉంది.