CJ Calls for Indian Philosophy in Legal Education: మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్.ఎ. ధర్మాధికారి లా విద్యపై కీలక వ్యాఖ్యలు చేశారు. లా విద్యార్థులకు కేవలం ఆధునిక చట్టాలే కాకుండా భారతీయ సాంప్రదాయ, తాత్విక విలువలపై కూడా అవగాహన ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా జైనిజం, బుద్ధిజం, మనుస్మృతి, అర్థశాస్త్రం వంటి అంశాలను తప్పనిసరిగా బోధించాల్సిన అవసరం ఉందని సూచించారు.
తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన, దేశంలోని జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాలు మంచి ప్రతిభ కలిగిన విద్యార్థులను తయారు చేస్తున్నప్పటికీ, వారి లక్ష్యం ఎక్కువగా త్వరగా ధనవంతులు కావడంపైనే కేంద్రీకృతమైందని వ్యాఖ్యానించారు. దీంతో విద్యార్థులు తమ సాంస్కృతిక, సైద్ధాంతిక మూలాలను మరిచిపోతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. లా పట్టభద్రులు సమాజంలో బాధ్యతాయుత పాత్ర పోషించాలంటే వారి ఆలోచనల్లో స్థిరత్వం, పరిపక్వత ఉండాలని ఆయన చెప్పారు. ఇందుకు భారతీయ సంస్కృతి, కర్తవ్య భావన, కర్మ సిద్ధాంతం వంటి అంశాలపై అవగాహన కల్పించడం ఎంతో అవసరమని నొక్కి చెప్పారు. ఈ విలువలు విద్యార్థులను సమగ్రంగా తీర్చిదిద్దుతాయని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ నేపథ్యంలో దేశంలోని అన్ని లా కాలేజీల్లో ఈ విషయాలపై ప్రత్యేక కోర్సులను ప్రవేశపెట్టాలని ఆయన సూచించారు. విద్యార్థులు కేవలం ఉద్యోగం లేదా సంపాదన కోణంలో కాకుండా, సమాజానికి ఉపయోగపడేలా, బాధ్యతాయుతంగా ఆలోచించేలా మారాలని ఆయన ఆకాంక్షించారు.