Homeఅంతర్జాతీయంతమిళనాడులో కింగ్ ఎవరు..?!

తమిళనాడులో కింగ్ ఎవరు..?!

  • నేడే ఎన్నికల పోలింగ్

  • గెలుపు ఓటములను నిర్దేశించే స్థాయిలో విజయ్

  • హాంగ్ వస్తే దళపతి కీలకం

క్రైమ్ మిర్రర్, ఎలక్షన్ డెస్క్: మరికొద్ది గంటల్లోనే తమిళనాడు ఎన్నికల పోలింగ్ ప్రారంభం కానుంది. ఆ రాష్ట్ర రాజకీయ భవిష్యత్తును నిర్ణయించనుంది. మరోసారి డిఎంకె కూటమికి ప్రజలు అవకాశం ఇస్తారా? లేకుంటే ఆనవాయితీ ప్రకారం అన్న డీఎంకేకు ఛాన్స్ ఇస్తారా? లేకుంటే విజయ్ ను కింగ్ మేకర్ చేస్తారా? అనేది తమిళ ప్రజల తీర్పు పై ఆధారపడి ఉంది.

అన్నా డీఎంకే గట్టి పోటీ..
తమిళనాడు ఎన్నికలు హోరా హోరీగా ఉండనున్నాయి. డీఎంకే వర్సెస్ అన్నడిఎంకే అన్నట్టు పరిస్థితి ఉంది. జయలలిత మరణంతో అన్నాడీఎంకే పని అయిపోయిందని అంతా భావించారు. కానీ ఆ పార్టీకి బిజెపి తోడు కావడం.. మిగతా మిత్రులంతా కలిసిపోవడంతో డీఎంకేకు గట్టి పోటీ ఇచ్చే పరిస్థితికి ఆ కూటమి చేరుకుంది. మరోవైపు సినీ నటుడు విజయ్ పార్టీ సైతం బరిలో ఉంది. దీంతో ఆ పార్టీ చీల్చే ఓట్లు తమిళనాడు ఎన్నికల ఫలితాలను నిర్ణయించునున్నాయి.

ఇప్పుడిప్పుడే స్పష్టత..
అయితే ఇప్పటికే తమిళనాడు రాజకీయాలపై ఒక స్పష్టత వస్తుంది. దశాబ్దాలుగా డిఎంకె, అన్న డీఎంకేల మధ్య సాగుతున్న తమిళ రాజకీయాల్లో ఈసారి తమిళగ వెట్రికలగం రూపంలో ఒక బలమైన మూడో శక్తి ప్రవేశించింది. సీఎం స్టాలిన్ సంక్షేమ పథకాల భరోసాతో ముందుకు సాగుతున్నారు. పళని స్వామి మాత్రం ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను ప్రస్తావిస్తూ ముందుకు సాగారు. అయితే వీరిద్దరికీ భిన్నంగా విజయ్ కేవలం యువతను, మహిళలను లక్ష్యంగా చేసుకొని రంగంలోకి దిగారు. విజయ్ కేవలం సినిమా నటుడు మాత్రమే కాదు రాజకీయంగా కూడా ఒక శక్తిగా ఎదిగారు అన్నది విశ్లేషకుల మాట. ఈ ఎన్నికల్లో ఆయన విజయం సాధించలేక పోవచ్చు కానీ.. ప్రత్యర్థుల గెలుపు ఓటములను నిర్దేశించే స్థాయికి మాత్రం చేరుకున్నారు.

తేలిగ్గా తీసుకుంటే అంతే..
విజయ్ పార్టీని చాలా తేలిగ్గా తీసుకున్నారు రాజకీయ ప్రత్యర్థులు. కానీ ఏమో చెప్పలేం అన్నట్టు విశ్లేషకులు చెబుతున్నారు అంటే పరిస్థితి ఎంత దాకా వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. విజయ్ సభలకు భారీగా జనాలు తరలివస్తున్నారు. అయితే అది సినీ అభిమానమే తప్ప ఓట్లు రూపంలో మారవని ప్రత్యర్థులు తెలుగు తీసుకుంటున్నారు. కానీ అంత తేలికగా తీసుకుంటే మొదటికే మోసం వస్తుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. తమిళనాడులో దాదాపు 25 శాతం ఉన్న యువ ఓటర్లు, మార్పు కోరుకుంటున్న తటస్తులు మాత్రం విజయ్ వైపు మొగ్గు చూపుతున్నారు అన్నది స్పష్టంగా తెలుస్తోంది. ఇక విజయ్ ప్రకటించిన నెలవారి రూ.2500 నగదు బదిలీ, ఉచిత గ్యాస్ సిలిండర్ వంటి హామీలు కిందిస్థాయి వర్గాల్లోకి బలంగా వెళ్లాయి. అయితే డిఎంకె తో పాటు అన్న డీఎంకే మాదిరిగా క్షేత్రస్థాయిలో బలమైన నెట్వర్క్ లేకపోవడం విజయ్ కు మైనస్.

ఎవరి ఓట్లు చీల్చుతారు..
అయితే విజయ్ ఎవరి ఓట్లు చీలుస్తారు అనేది ఇప్పుడు తమిళనాడులో హాట్ టాపిక్. సాధారణంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు విపక్ష అన్న డీఎంకే కూటమికి వెళ్ళాలి. కానీ విజయ్ రంగంలో ఉండడంతో ఓట్ల చీలిక అనేది స్పష్టంగా కనిపిస్తోంది. కొన్ని సర్వేల ప్రకారం అయితే విజయ్ దాదాపు పది నుంచి పదిహేను శాతం ఓట్లను సాధించే అవకాశం ఉంది. అయితే ఈ ఓట్లు పట్టణ ప్రాంతాల్లోనే అధికంగా ఉంటాయి. అందుకే పట్టణ ప్రాంతాల్లో బలమైన అభ్యర్థులను రంగంలోకి దించారు విజయ్. అయితే విజయ్ సాధించే ఓట్ల శాతం పెరిగే కొలది అన్న డీఎంకేకు ఇబ్బందులు తప్పవని తెలుస్తోంది. అంతిమంగా అది డీఎంకేకు కలిసి రావచ్చు అన్నది విశ్లేషకుల మాట.. అధికార పార్టీపై అసంతృప్తి వర్గాలు విజయ వైపు వెళ్తే మాత్రం డీఎంకే కూటమికి సీట్లు తగ్గే అవకాశం కూడా ఉంది.

ఎవరికి మద్దతు ఇస్తారు..
తమిళనాడు ఎన్నికల ఫలితాలు ఈసారి విచిత్రంగా వస్తే సీన్ ఏంటి అనేది ఒక చర్చ. దశాబ్దాలుగా తమిళనాడులో కూటమిలు కట్టి ప్రధాన పార్టీలు అధికారంలోకి వస్తున్నాయ. అయితే ఈసారి హంగ్ అసెంబ్లీ ఏర్పడే అవకాశాలను కొన్ని సర్వేలు అంచనా వేస్తున్నాయి. ఒకవేళ ఏ కూటమికి స్పష్టమైన మెజారిటీ రాకపోతే.. అదే సమయంలో విజయ్ పది నుంచి 15 సీట్లు గెలుచుకుంటే కింగ్ మేకర్ కావడం ఖాయం. విజయ్ తన ప్రసంగంలో అటు డీఎంకేను.. అన్నా డీఎంకే లో ఉన్న బిజెపిని టార్గెట్ చేస్తూ మాట్లాడారు. 11 ఒక ప్రత్యేక సెక్యులర్ ఇమేజ్ను సొంతం చేసుకున్నారు. ఇటువంటి సమయంలో ఆయన కింగ్ మేకర్ గా మారితే ఎవరికీ మద్దతు చెబుతారు అనేది చెప్పడం కష్టమే.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు