ఎవరికి అయినా అప్పు ఇస్తున్నప్పుడు కేవలం నమ్మకంపై ఆధారపడటం కన్నా చట్టబద్ధమైన ఆధారాలతో వ్యవహరించడం ఎంతో కీలకమని న్యాయ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. చాలా సందర్భాల్లో పరిచయం లేదా స్నేహం పేరుతో డబ్బు ఇచ్చిన తర్వాత తిరిగి రాకపోవడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో అప్పుగా ఇచ్చిన సొమ్మును భద్రంగా తిరిగి పొందాలంటే ముందస్తుగా సరైన జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. చట్టపరంగా అందుబాటులో ఉన్న కొన్ని ముఖ్యమైన మార్గాలను ఉపయోగిస్తే భవిష్యత్తులో తలెత్తే సమస్యలను చాలా వరకు నివారించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
అప్పుల విషయంలో సాధారణంగా ఎక్కువగా వినియోగంలో ఉన్న పద్ధతి ప్రామిసరీ నోట్. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాల వరకు ఈ విధానం విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. ప్రామిసరీ నోట్ రాసేటప్పుడు తప్పనిసరిగా ఇద్దరు సాక్షులు ఉండేలా చూసుకోవాలి. ఇది భవిష్యత్తులో వివాదాలు తలెత్తినప్పుడు కీలక ఆధారంగా ఉపయోగపడుతుంది. అయితే ఈ నోటుకు కేవలం 3 సంవత్సరాల కాలపరిమితి మాత్రమే ఉంటుంది. ఈ గడువు పూర్తయ్యేలోపు అప్పును తిరిగి పొందాలి లేదా కోర్టులో మనీ రికవరీ దావా దాఖలు చేయాలి. ఒకవేళ ఆ గడువులో అప్పు చెల్లించకపోతే, పాత నోటును రద్దు చేసి, ఇద్దరి అంగీకారంతో కొత్త నోట్ రాసుకోవడం ద్వారా మరో 3 సంవత్సరాల వరకు గడువును పొడిగించుకునే అవకాశం ఉంటుంది.
ఇంకొక ముఖ్యమైన అంశం చెక్ ద్వారా జరిగే లావాదేవీలు. అప్పు తీసుకున్న వ్యక్తి ఇచ్చిన చెక్ బ్యాంకులో నిధుల కొరత కారణంగా బౌన్స్ అయితే అది నేరంగా పరిగణించబడుతుంది. ఇలాంటి సందర్భాల్లో నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ చట్టం కింద క్రిమినల్ కేసు నమోదు చేయవచ్చు. కోర్టు విచారణలో అప్పు తీసుకున్న వ్యక్తికి జైలు శిక్ష విధించే అవకాశమేకాకుండా, బాధితుడికి డబ్బు తిరిగి చెల్లించేలా ఆదేశాలు కూడా జారీ చేస్తుంది. ముఖ్యంగా ఆస్తి లావాదేవీలు, అపార్ట్మెంట్ కొనుగోళ్లు వంటి సందర్భాల్లో చెక్ బౌన్స్ సమస్యలు ఎక్కువగా కనిపిస్తుండటంతో జాగ్రత్త అవసరం.
అదే విధంగా నగదు రూపంలో డబ్బు ఇవ్వడం కన్నా బ్యాంక్ ద్వారా లావాదేవీలు జరపడం మరింత సురక్షితంగా ఉంటుంది. ఆన్లైన్ ద్వారా పంపిన డబ్బు లేదా నేరుగా బ్యాంక్ ఖాతాలో జమ చేసిన మొత్తానికి సంబంధించిన స్టేట్మెంట్ కోర్టులో బలమైన ఆధారంగా నిలుస్తుంది. ఎలాంటి పత్రాలు లేకుండా కేవలం నగదు రూపంలో అప్పు ఇస్తే, ఆ డబ్బును తిరిగి పొందడం చాలా కష్టంగా మారుతుంది. సాక్షులు ఉన్నా వారు కోర్టుకు రావడానికి ఇష్టపడకపోవచ్చు. అందువల్ల అప్పు ఇస్తున్నప్పుడు తప్పనిసరిగా ఈ మూడు మార్గాల్లో ఏదో ఒకదాన్ని పాటించడం ద్వారా మీ కష్టపడి సంపాదించిన డబ్బును రక్షించుకోవచ్చు. చట్టంపై అవగాహన కలిగి ఉండటం ఆర్థిక భద్రతకు మొదటి అడుగు అని నిపుణులు సూచిస్తున్నారు.
ALSO READ: ఏపీ ప్రభుత్వం సూపర్ న్యూస్.. పెన్షన్ల విధానంలో మార్పులు
