వికారాబాద్, క్రైమ్ మిర్రర్: వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలంలో సోమవారం ఉదయం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన భార్యాభర్తలు, కుమార్తె మృతి చెందారు. దీంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం పెద్దెముల్ మండలం రుక్మాపూర్ గ్రామానికి చెందిన దంపతులు కుమారుడు, కుమార్తెతో కలిసి ద్విచక్రవాహనంపై జహీరాబాద్ వెళ్తుండగా, గుర్తుతెలియని వాహనం వీరిని బలంగా ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో జహీరాబాద్కు చెందిన కవిరాజ్ (40), పావని (35), వారి కుమార్తె కీర్తన (11) తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందారు. కాగా, ఈప్రమాదం నుండి కుమారుడు గాయాలతో బయటపడటంతో స్థానికులు తాండూర్ ఆసుపత్రికి తరలించారు. ఘటన స్థలానికి పెద్దేముల్ ఎస్సై ప్రశాంత్ వర్ధన్ చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు.
