ఆంధ్రప్రదేశ్లో ఎండలు రోజురోజుకీ తీవ్ర రూపం దాల్చుతున్నాయి. గత కొద్దిరోజులుగా ఉష్ణోగ్రతలు అసాధారణ స్థాయికి చేరుకోవడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ముఖ్యంగా పాఠశాల విద్యార్థులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్యాన్ని కాపాడేందుకు పాఠశాలల పనివేళల్లో మార్పులు చేయాలని ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. ఎండ తీవ్రత పెరగకముందే పాఠశాలలను ముగించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 43 నుంచి 45 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సాధారణ సమయాల ప్రకారం బడులు నిర్వహించడం విద్యార్థుల ఆరోగ్యానికి ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ మోడల్ స్కూల్స్ టీచర్స్ అసోసియేషన్ విద్యాశాఖను ప్రత్యేకంగా అభ్యర్థించింది. ప్రస్తుతం అమలులో ఉన్న సమయాల్లో మధ్యాహ్నం వరకు తరగతులు కొనసాగడం వల్ల విద్యార్థులు వడదెబ్బకు గురయ్యే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేసింది. అందుకే ఉదయం వేళల్లోనే తరగతులు నిర్వహించి, గరిష్టంగా 11 గంటలకల్లా పాఠశాలలను ముగించాలని సూచించింది. చిన్నారులు అధిక ఉష్ణోగ్రతలను తట్టుకోలేరని, తరగతి గదుల్లో ఉక్కపోత కారణంగా అనారోగ్య సమస్యలు పెరుగుతున్నాయని తల్లిదండ్రులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే ఒంటిపూట బడులు అమలులో ఉన్నప్పటికీ, మధ్యాహ్నానికి ముందే ఎండ తీవ్రత పెరుగుతుండటంతో మరింత జాగ్రత్తలు అవసరమని విద్యా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా 11 గంటల తర్వాత ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతున్నందున ఆ సమయానికి ముందే విద్యార్థులను ఇంటికి పంపడం సురక్షితమని సూచిస్తున్నారు. ఈ చర్యల ద్వారా వడదెబ్బ వంటి ప్రమాదాలను నివారించవచ్చని భావిస్తున్నారు.
ఇక ప్రభుత్వ అధికారిక షెడ్యూల్ ప్రకారం రాష్ట్రంలో పాఠశాలలకు వేసవి సెలవులు ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు ఉండనున్నాయి. అంటే మరో 10 రోజుల్లో సెలవులు ప్రారంభం కానున్నాయి. అయితే ఈ మధ్యకాలంలో కూడా ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉన్నందున, తక్షణమే పనివేళల తగ్గింపుపై నిర్ణయం తీసుకోవాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు. విద్యార్థుల ఆరోగ్యం దృష్ట్యా ప్రభుత్వం త్వరితగతిన స్పందించాలని వారు ఆశిస్తున్నారు.
ALSO READ: హార్ట్ రిస్క్ స్టార్ట్ అయ్యేది చిన్నప్పుడేనా?
