HomeజాతీయంModi- Rahul: పొలిటికల్ హీట్ లో కూల్ మూమెంట్.. మోదీ–రాహుల్ చిట్‌ చాట్!

Modi- Rahul: పొలిటికల్ హీట్ లో కూల్ మూమెంట్.. మోదీ–రాహుల్ చిట్‌ చాట్!

మహాత్మా జ్యోతిబా ఫులే 200వ జయంతి సందర్భంగా పార్లమెంట్ ప్రాంగణంలో ఆసక్తికర దృశ్యం కనిపించింది. ప్రేరణా స్థల్ దగ్గర నివాళులు అర్పించేందుకు ప్రముఖ నేతలు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ కొద్దిసేపు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం అందరి దృష్టిని ఆకర్షించింది.

మోదీ-రాహుల్ చిట్ చాట్

కార్యక్రమానికి ముందుగా వచ్చిన ప్రధాని మోదీ అక్కడ ఉన్న ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, అలాగే రాహుల్ గాంధీతో పాటు ఇతర నాయకులను పలకరించారు. అనంతరం ఆయన నివాళులు అర్పించేందుకు ముందుకు వెళ్లారు. అయితే కొద్దిసేపటి తర్వాత మళ్లీ వెనక్కి వచ్చి రాహుల్ గాంధీతో ప్రత్యేకంగా మాట్లాడటం అక్కడ ఉన్నవారికి ఆశ్చర్యాన్ని కలిగించింది.

పొలిటికల్ హీట్ పెరిగిన నేపథ్యంలో..

ఇటీవల రాజకీయ వాతావరణం తీవ్రంగా మారిన నేపథ్యంలో ఈ సంఘటన ప్రాధాన్యం సంతరించుకుంది. ముఖ్యంగా పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ, ప్రధాన పార్టీలు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నాయి. ఇలాంటి సమయంలో ప్రధానమంత్రి, ప్రతిపక్ష నేత స్నేహపూర్వకంగా మాట్లాడుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది.

ఇద్దరి మధ్య మాటల యుద్ధం

ఇటీవలి కాలంలో మోదీ, రాహుల్ గాంధీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. పలు సభలు, ర్యాలీల్లో రాహుల్ గాంధీ ప్రధాని మోదీపై తీవ్ర విమర్శలు చేశారు. దేశ విదేశాంగ విధానం వ్యక్తిగతంగా మారిందని, అంతర్జాతీయ నిర్ణయాల్లో ఇతర దేశాల ప్రభావం ఎక్కువగా ఉందని ఆయన ఆరోపించారు. దీనికి ప్రతిస్పందనగా ప్రధాని మోదీ కూడా రాహుల్ గాంధీపై విమర్శలు గుప్పించారు. ఆయనను స్వయం ప్రకటిత  రాజకుమారుడిగా అభివర్ణిస్తూ రాజకీయంగా ఎదురుదాడి చేశారు.

విమర్శల మధ్యలోనే పార్లమెంట్ ప్రాంగణంలో జరిగిన ఈ చిన్న సంభాషణ, రాజకీయాల్లో వ్యక్తిగత విభేదాలు ఉన్నప్పటికీ పరస్పర గౌరవం కొనసాగుతుందని సూచిస్తున్నట్లు భావిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో విభిన్న అభిప్రాయాలు సహజమని, కానీ వ్యక్తిగతంగా మర్యాదపూర్వక సంబంధాలు కొనసాగడం మంచి సంకేతమని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.  ఫులే జయంతి కార్యక్రమంలో జరిగిన ఈ చిన్న సంఘటన రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది.

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 15 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు