హైదరాబాద్ నగరంలో ఓ పెంపుడు పిల్లి విషయంలో మొదలైన చిన్న గొడవ చివరకు పోలీస్ స్టేషన్ వరకు వెళ్లడం చర్చనీయాంశమైంది. సాధారణంగా కనిపించే ఈ ఘటన, కొంతసేపు ఉద్రిక్తతను సృష్టించి, పోలీసుల జోక్యంతో సర్దుమణిగింది. లల్లాగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ సంఘటన స్థానికంగా ఆసక్తిని రేకెత్తించింది.
వివరాల ప్రకారం.. అడ్డగుట్ట ప్రాంతానికి చెందిన ఓ మహిళ తన పెంపుడు పిల్లి కనిపించకుండా పోయిందని పోలీసులను ఆశ్రయించింది. తన ఇంటి ముందు తిరుగుతున్న పిల్లిని ఓ వ్యక్తి తీసుకెళ్లాడని ఆమె ఆరోపించింది. అనుమానం కలగడంతో వెంటనే సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించిన ఆమె, బైక్ నంబర్ ఆధారంగా అనుమానితుడిని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
పోలీసుల విచారణలో ఆ వ్యక్తి చింతల్ ప్రాంతానికి చెందిన మొక్కలు అమ్మే వ్యాపారి అని తేలింది. అతడిని స్టేషన్కు పిలిపించి ప్రశ్నించగా, పిల్లిని పట్టుకునే సమయంలో అది తన చేతిని కరిచి పారిపోయిందని వివరించాడు. అయితే, తన పెంపుడు జంతువును తిరిగి ఇవ్వాలని మహిళ పట్టుబట్టడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పరిస్థితి కాస్త ఉద్రిక్తంగా మారడంతో పోలీస్ ఇన్స్పెక్టర్ జోక్యం చేసుకుని దాదాపు అరగంటపాటు కౌన్సెలింగ్ నిర్వహించారు.
చివరికి ఆ వ్యక్తి మహిళకు క్షమాపణ చెప్పడంతో వివాదం తాత్కాలికంగా ముగిసింది. పోలీసులు అతడికి హెచ్చరిక జారీ చేసి వదిలేశారు. అయితే, ఈ వ్యవహారం కారణంగా స్టేషన్ వెలుపల ఎదురు చూస్తున్న ఇతర ఫిర్యాదుదారులు అసహనం వ్యక్తం చేశారు. చిన్న విషయాన్ని పెద్దది చేసి, పోలీసుల సమయాన్ని వృథా చేశారని ఆగ్రహం వ్యక్తమైంది.
ALSO READ: విచిత్ర చోరీ.. నగలతో పాటు కిచెన్ కూడా ఖాళీ
