క్రైమ్ మిర్రర్, తెలంగాణ స్టేట్ బ్యూరో: తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల లొంగుబాట్లు ఇటీవల గణనీయంగా పెరిగాయి. ముఖ్యంగా ప్రభుత్వం అమలు చేస్తున్న పునరావాస పథకాలు, పోలీసు ఆపరేషన్ల తీవ్రత వల్ల అగ్రనేతలతో సహా వందలాది మంది కేడర్ జనజీవన స్రవంతిలో కలుస్తున్నారు.
తెలంగాణలో సుమారు 30 మంది మావోయిస్టులు ఈరోజు రాష్ట్ర డీజీపీ ఎదుట లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నట్లు ఈనాడు కథనం పేర్కొంది. అంతకుముందే ఏప్రిల్ 6న మావోయిస్ట్ పార్టీ కీలక నేత, పీఎల్జీఏ డిప్యూటీ కమాండర్ సోది కేశాలు అలియాస్ మల్లా మరో 30 మందితో కలిసి లొంగిపోయారు.
ఆంధ్రప్రదేశ్ లో అల్లూరి సీతారామరాజు జిల్లాలో చత్తీస్ఘడ్ క్యాడర్కు చెందిన ఐదుగురు మావోయిస్టులు నిన్న (ఏప్రిల్ 9) ఎస్పీ ఎదుట లొంగిపోయారు. ప్రస్తుతం అల్లూరి, పోలవరం ప్రాంతాల్లో మావోయిస్టుల కదలికలు పూర్తిగా నిలిచిపోయాయని పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు.
ఛత్తీస్గఢ్ లో కేంద్ర ప్రభుత్వం విధించిన గడువు (మార్చి 31) సమీపించిన నేపథ్యంలో మార్చి నెలలో భారీగా లొంగుబాట్లు జరిగాయి. బస్తర్ రేంజ్ పరిధిలో ఏకంగా 108 మంది మావోయిస్టులు రూ.3.61 కోట్ల నగదు, భారీగా బంగారాన్ని పోలీసులకు అప్పగించి లొంగిపోయారు. ఏప్రిల్ 1న బీజాపూర్లో మరో 25 మంది కీలక సభ్యులు ఆయుధాలతో సహా సరెండర్ అయ్యారు.
లొంగుబాటుకు ప్రధాన కారణాలు…
ప్రభుత్వ పునరావాస పథకాలు మరియు ఆర్థిక సహాయం.
పోలీసుల ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ వంటి వ్యూహాత్మక చర్యలు.
పార్టీ సిద్ధాంతాలపై అసంతృప్తి మరియు గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి పనులు వేగవంతం కావడం.
