* రెండుసార్లు గుంటూరు ఎంపీగా..
* 2024 ఎన్నికల ముందు క్రియాశీలక రాజకీయాలకు గుడ్ బై..
* అయినా సరే టిడిపిలోనే..
క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో: ఏపీలో రాజకీయ దురదృష్టుడు అంటే ఇట్టే గుర్తుకు వస్తారు గల్లా జయదేవ్. స్వతహాగా పారిశ్రామిక కుటుంబంలోంచి వచ్చిన జయదేవ్ రెండుసార్లు గుంటూరు పార్లమెంట్ సభ్యుడిగా గెలిచారు. మూడోసారి బరిలో దిగి గెలిస్తే తప్పకుండా కేంద్రమంత్రి అయ్యుండేవారు. కానీ 2024 ఎన్నికల ముంగిట అనూహ్యంగా క్రియాశీలక రాజకీయాలకు దూరమయ్యారు. అరుదైన అవకాశాన్ని కోల్పోయారు. ఆయన స్థానంలో టిడిపి అభ్యర్థిగా పోటీ చేసిన మరో పారిశ్రామికవేత్త పెమ్మసాని చంద్రశేఖర్ ఏకంగా గెలిచారు. కేంద్రమంత్రి అయ్యారు. అప్పటినుంచి గల్లా జయదేవ్ పై అందరూ సానుభూతి చూపిస్తున్నారు. అయితే ఇప్పుడు గల్లా జయదేవ్ సేవలను ఉపయోగించుకోవాలని చంద్రబాబు ఒక నిర్ణయానికి వచ్చినట్లు ప్రచారం నడుస్తోంది.
సరిగ్గా అంచనా వేయలేక..
ఏపీ రాజకీయాలను సరిగ్గా అంచనా వేయలేకపోయారు గల్లా జయదేవ్. టిడిపి కూటమి అధికారంలోకి వస్తుందని ఆయన భావించలేదు. కేంద్రంలో టిడిపి కీలక భాగస్వామి అవుతుందని అంచనా వేయలేక పోయారు. అందుకే ఈ ఎన్నికల ముందు అనూహ్యంగా క్రియాశీలక రాజకీయాలకు దూరం అయ్యారు. అయితే ఆ అదృష్టం దక్కించుకున్నారు పెమ్మసాని చంద్రశేఖర్. కానీ ఇప్పుడు గల్లా జయదేవ్ కు కీలక పదవి కట్టబెట్టాలని చంద్రబాబు భావిస్తున్నట్లు ప్రచారం నడుస్తోంది. రాజ్యసభకు పంపించి ఆయన సేవలను వినియోగించుకోవాలని చూస్తున్నారట. స్వతహాగా రాజ్యసభ పదవి అనేది పారిశ్రామిక వర్గాలకు ఇస్తుంటారు. దానిని జయదేవ్ కు సర్దుబాటు చేస్తారని తెలుస్తోంది.
సుదీర్ఘ నేపథ్యం..
గల్లా కుటుంబానికి ఉమ్మడి రాష్ట్రంలోనే మంచి పేరు ఉంది. గల్లా రామచంద్ర నాయుడు పారిశ్రామిక వేత్తగా రాణించారు. అయితే 2003లో రాజశేఖర్ రెడ్డి పిలుపుతో కాంగ్రెస్ పార్టీలో చేరారు గల్లా జయదేవ్ తల్లి, రామచంద్ర నాయుడు భార్య అరుణ కుమారి. 2004, 2009 ఎన్నికల్లో చంద్రగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలో చేరారు. అటు తరువాత రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్లో సైతం కొనసాగారు. రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పింది గల్లా ఫ్యామిలీ. తల్లి అరుణ కుమారి తో కలిసి జై దేవ్ టిడిపిలో చేరారు. గుంటూరు పార్లమెంట్ స్థానం అభ్యర్థిగా జయదేవ్, చంద్రగిరి నుంచి అరుణకుమారి టిడిపి అభ్యర్థులుగా పోటీ చేశారు. కానీ అరుణకుమారి ఓడిపోయారు. జయదేవ్ గెలిచారు. అనంతరం అరుణకుమారి క్రియాశీలక రాజకీయాలకు దూరమయ్యారు. 2019లో రెండోసారి జయదేవ్ గుంటూరు నుంచి పోటీ చేసి గెలిచారు. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తమ కంపెనీల పరంగా ఇబ్బందులు ఎదురయ్యాయి. అటు కేంద్రం సైతం జయదేవ్ విషయంలో కఠినంగా వ్యవహరించడంతో 2024 ఎన్నికలకు ముందు క్రియాశీలక రాజకీయాలకు దూరమయ్యారు జయదేవ్.
ఇప్పుడు యాక్టివ్ గానే..
కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ కార్యకలాపాల్లో ఎక్కువగా కనిపిస్తున్నారు జయదేవ్. ఢిల్లీలో పార్టీ ఎంపీలతో తరచూ కనిపిస్తుంటారు. చంద్రబాబుతో పాటు లోకేష్ వెంట కూడా ఉంటారు. ఈ క్రమంలో గల్లా జయదేవ్ కు రాజ్యసభ పదవి ఇవ్వనున్నట్లు ప్రచారం నడుస్తోంది. జూన్లో ఓ నలుగురు రాజ్యసభ సభ్యులు ఏపీ నుంచి పదవి విరమణ వద్దనున్నారు. ఆ నాలుగు రాజ్యసభ స్థానాలు కూటమికి దక్కనున్నాయి. తెలుగుదేశం పార్టీ రెండు, జనసేన తో పాటు బిజెపికి ఒక్కో స్థానం కేటాయిస్తారని ప్రచారం జరుగుతోంది. టిడిపి తరఫున రాజ్యసభకు గల్లా జయదేవ్ వెళ్లడం ఖాయమన్న టాక్ నడుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో??
