నిర్మల్, క్రైమ్ మిర్రర్: బాసర ఆలయ అభివృద్దికి మహర్ధశ పట్టుకుంది. ప్రజా పాలన, ప్రగతి ప్రణాళికలతో భాగంగా నిర్మల్ జిల్లాల్లోని బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయ పనురుద్దరణ పనులకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా రూ.225 కోట్లతో ఆలయ విస్తరణ అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. అంతకుముందు అమ్మవారిని దర్శించుకున్నారు. మనవడికి అక్షరాభ్యాసం చేయించారు.
శృంగేరి పీఠాధిపతుల దివ్య మార్గదర్శకత్వంలో రూపొందించిన మాస్టర్ ప్లాన్ ప్రకారం, ఆలయ విస్తీర్ణాన్ని 20 వేల నుంచి 62 వేల చదరపు అడుగులకు పెంచుతూ, కృష్ణ శిలలతో 9 అంతస్తుల రాజగోపురం, మాడ వీధులు, కోనేరు, ధ్యాన మందిరాలను నిర్మించనున్నారు. భక్తుల సౌకర్యార్థం 6 వేల మంది సామర్థ్యంతో క్యూ కాంప్లెక్స్లు, అన్నదాన సత్రం, విశాలమైన పార్కింగ్తో పాటు అక్షరాభ్యాసానికి వచ్చే చిన్నారుల కుటుంబాలకు మెరుగైన వసతులు కల్పించనున్నారు. భూమిపూజ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
