సర్ప సంరక్షణలో సాటిలేని ధీరుడు..
ఆపదలో అభయమిచ్చే లోయపల్లి హనుమంతు.
మర్రిగూడ (క్రైమ్ మిర్రర్): రంగారెడ్డి జిల్లా మంచాల మండలం, లోయపల్లి గ్రామానికి చెందిన అక్కిడి హనుమంతు ప్రకృతి ప్రేమికుడిగా, నిస్వార్థ సేవకుడిగా ఆ ప్రాంత ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేస్తున్నారు. సాధారణంగా పాము కనిపిస్తేనే ఒళ్లు గగుర్పొడిచి, భయంతో ప్రాణ రక్షణ కోసం వాటిని హతమార్చే వారు అధికంగా ఉన్న ఈ రోజుల్లో, హనుమంతు మాత్రం వాటిని ప్రాణప్రదంగా కాపాడుతూ, పర్యావరణ సమతుల్యతను కాపాడుతున్నారు.
జనావాసాల్లోకి, గృహాల్లోకి పొరపాటున ప్రవేశించే అత్యంత ప్రమాదకరమైన, నాగుపాములను సైతం తన ప్రాణాలకు తెగించి, అపరిమితమైన చాకచక్యంతో ఎటువంటి గాయాలు కాకుండా పట్టుకోవడంలో ఆయన దిట్ట. పట్టుకున్న సర్పాలను సురక్షితంగా సమీపంలోని, అటవీ ప్రాంతాల్లో విడిచిపెడుతూ అటు మూగజీవాలకు పునర్జన్మను, ఇటు గ్రామస్థులకు ప్రాణరక్షణను కల్పిస్తున్నారు.
కేవలం సర్పాలను పట్టడమే కాకుండా, పురాతన నాటు వైద్యంలో ప్రావీణ్యం సంపాదించిన హనుమంతు, ఆపదలో ఉన్న వారికి పైసా ఖర్చు లేకుండా, నిస్వార్థంగా సేవలు అందిస్తూ మన్ననలు పొందుతున్నారు. తాజాగా మర్రిగూడ పోలీస్ స్టేషన్ ఆవరణలో ప్రత్యక్షమైన భారీ నాగుపామును, ఆయన అత్యంత సాహసోపేతంగా బంధించి, సురక్షిత ప్రాంతానికి తరలించి, స్థానికులను అబ్బురపరిచారు. ఏ సమయంలోనైనా, ఏ కష్టంలోనైనా పిలవగానే పలికే ఆపద్బాంధవుడిగా పేరుగాంచిన హనుమంతు సేవలు నేటి సమాజానికి ఎంతో ఆదర్శప్రాయంగా నిలుస్తున్నాయి.
