-
సోషల్ మీడియాలో ‘అతి’ చేస్తే కటకటాలే
-
వ్యక్తిగత దూషణలు, విద్వేష పూరిత పోస్టులపై నిఘా..
-
అడవిదేవులపల్లి ఎస్ఐ శేఖర్ హెచ్చరిక.
అడవిదేవులపల్లి (క్రైమ్ మిర్రర్): సోషల్ మీడియా వేదికగా విచ్చలవిడితనానికి పాల్పడితే, ఊరుకునే ప్రసక్తే లేదని అడవిదేవులపల్లి ఎస్ఐ వి.శేఖర్ హెచ్చరించారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రాజకీయ నాయకులను, జర్నలిస్టులను, ఇతర సామాన్యులను లక్ష్యంగా చేసుకుని అసభ్యకరమైన పోస్టులు పెట్టినా, వారి గౌరవానికి భంగం కలిగించినా, కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
నెట్టింట జరిగే ప్రతి కదలికపై పోలీసుల నిఘా ఉంటుందని, నిబంధనలు అతిక్రమిస్తే కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తామన్నారు. ముఖ్యంగా యువత సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా వాడుకోవాలని, తప్పుడు ప్రచారాలతో సమాజంలో విద్వేషాలు నింపవద్దని సూచించారు. శాంతిభద్రతల పరిరక్షణలో ప్రతి ఒక్కరూ సహకరించాలని, రెచ్చగొట్టే పోస్టులకు దూరంగా ఉండాలని ఈ సందర్భంగా ఎస్ఐ వి. శేఖర్ సూచించారు.
