మర్రిగూడ,(క్రైమ్ మిర్రర్): మండలంలోని యరగండ్లపల్లి గ్రామంలో, గత ఐదు రోజులుగా అత్యంత వేడుకగా జరుగుతున్న, శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థాన బ్రహ్మోత్సవాలు సోమవారం నాటి రథోత్సవంతో ఘనంగా ముగిశాయి. ఈ ఉత్సవాల ముగింపు సందర్భంగా, గ్రామ సర్పంచ్ వల్లంల సంతోష్ యాదవ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ, గ్రామ ప్రజలందరి సహకారంతో ఈ ఏడాది బ్రహ్మోత్సవాలు కనులపండువగా జరిగాయని సర్పంచ్ సంతోష్ యాదవ్ అన్నారు. ఈ నెల 26న ప్రారంభమైన ఈ వేడుకల్లో భాగంగా, శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవం, 29 ఆదివారం రోజున రేణుక ఎల్లమ్మ బోనాల ఉత్సవాలు, అత్యంత వైభవంగా నిర్వహించినట్లు పేర్కొన్నారు.
నేడు ఉదయం 7 గంటలకు స్వామి వారి రథోత్సవం అట్టహాసంగా సాగిందన్నారు. రథోత్సవం అనంతరం భక్తులందరికీ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తుల సౌకర్యార్థం దేవస్థాన కమిటీ, గ్రామ ప్రజలు అహర్నిశలు శ్రమించి, ఈ వేడుకలను విజయవంతం చేశారని, సర్పంచ్ సంతోష్ యాదవ్ వారిని కొనియాడారు. స్వామి వారి కృపతో గ్రామమంతా సుభిక్షంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి మంచన హరిబాబు శర్మ, దేవస్థాన కమిటీ సభ్యులు, గ్రామప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
