మన రోజువారీ ఆహారంలో ఉప్పు కీలక పాత్ర పోషిస్తుందనే విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగిన నేపథ్యంలో సాధారణ తెల్ల ఉప్పు కంటే పింక్ హిమాలయన్ ఉప్పు మెరుగైనదని భావిస్తూ చాలామంది తమ వంటగదిలో మార్పులు చేసుకుంటున్నారు. ఖరీదు ఎక్కువగా ఉన్నప్పటికీ పింక్ ఉప్పు సహజత్వం, అందులో ఉండే ఖనిజాల కారణంగా దీనికి ప్రాధాన్యం పెరుగుతోంది. అయితే ఈ రెండు రకాల ఉప్పుల మధ్య ఉన్న తేడాలు, ప్రయోజనాలు, వినియోగంపై స్పష్టత అవసరం ఉన్న అంశంగా మారింది.
సాధారణంగా మనం ఉపయోగించే తెల్ల ఉప్పు సముద్రపు నీటిని శుద్ధి చేసి తయారు చేస్తారు. ఈ ప్రక్రియలో ఉప్పును తెల్లగా మార్చేందుకు అనేక దశలు ఉంటాయి. ఈ శుద్ధి సమయంలో సహజంగా ఉండే అనేక ఖనిజాలు తొలగిపోతాయి. అయితే ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ ఉప్పులో అయోడిన్ను కలుపుతారు. ఇది ముఖ్యంగా థైరాయిడ్ సమస్యలను నివారించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అందువల్ల తెల్ల ఉప్పు పూర్తిగా హానికరం అని చెప్పడం సరైంది కాదు.
ఇక పింక్ హిమాలయన్ ఉప్పు విషయానికి వస్తే.. ఇది పాకిస్తాన్లోని హిమాలయ పర్వత ప్రాంత గనుల నుండి సహజంగా లభిస్తుంది. దీనిపై రసాయన ప్రాసెసింగ్ చాలా తక్కువగా ఉండటం వల్ల సహజ ఖనిజాలు ఇందులో అలాగే నిల్వ ఉంటాయి. పింక్ రంగు కూడా అందులో ఉన్న ఐరన్ వంటి ఖనిజాల కారణంగా వస్తుంది. ఈ ఉప్పులో సోడియంతో పాటు పొటాషియం, మెగ్నీషియం, క్యాల్షియం వంటి అనేక సూక్ష్మ ఖనిజాలు ఉండటంతో శరీరానికి ఉపయోగకరంగా భావిస్తున్నారు. రక్తపోటు సమస్య ఉన్నవారికి కూడా ఇది కొంతవరకు ఉపశమనం కలిగించవచ్చని భావిస్తున్నారు.
ఆయుర్వేదం ప్రకారం పింక్ ఉప్పును సైంధవ లవణంగా పిలుస్తారు. దీన్ని ఆహారంలో చేర్చడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడటం, గ్యాస్ మరియు అసిడిటీ సమస్యలు తగ్గడం వంటి ప్రయోజనాలు కలుగుతాయని పేర్కొంటారు. అలాగే శరీరంలోని పిహెచ్ స్థాయిలను సమతుల్యం చేయడంలో ఇది తోడ్పడుతుందని కూడా భావిస్తున్నారు. అయితే ఇవన్నీ వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితులపై ఆధారపడి ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు.
అయితే పింక్ ఉప్పు ఎంత మంచిదైనా, అందులో అయోడిన్ పరిమాణం తక్కువగా ఉండటం ఒక ముఖ్యమైన అంశం. శరీరానికి అవసరమైన అయోడిన్ అందకపోతే థైరాయిడ్ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల పూర్తిగా పింక్ ఉప్పుకు మారాలనుకునేవారు తమ ఆహారంలో ఇతర మార్గాల ద్వారా అయోడిన్ లభించేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవైపు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ, సమతుల్య ఆహారం తీసుకోవడం అత్యంత ముఖ్యమని వైద్యులు సూచిస్తున్నారు.
ఎలాంటి ఉప్పు వాడినా అతిగా తీసుకోవడం ఆరోగ్యానికి హానికరమే. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనల ప్రకారం ఒక వ్యక్తి రోజుకు 5 గ్రాముల కంటే తక్కువ ఉప్పు మాత్రమే తీసుకోవాలి. అధికంగా ఉప్పు తీసుకోవడం వల్ల రక్తపోటు, గుండె సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మీ ఆరోగ్య పరిస్థితులకు అనుగుణంగా ఏ ఉప్పు వాడాలి అనేది వైద్యుల సలహాతో నిర్ణయించుకోవడం ఉత్తమం.
