Spy Racket Busted in Ghaziabad: ఉత్తరప్రదేశ్లో భారీ గూఢచర్య ముఠా గుట్టురట్టు కావడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. పాకిస్థాన్ కు సంబంధించిన అనుమానాస్పద కార్యకలాపాలు జరుగుతున్నాయన్న సమాచారంతో ఘజియాబాద్ పోలీసులు చేపట్టిన దర్యాప్తు కీలక మలుపు తీసుకుంది. మొదట సాధారణంగా కనిపించిన ఈ కేసు, క్రమంగా అంతర్జాతీయ స్థాయి గూఢచర్య కుట్రగా మారడం భద్రతా వ్యవస్థలను అప్రమత్తం చేసింది.
దేశ రహస్యాలు లీక్!
భోవపూర్ ప్రాంతంలో కొందరు యువకులు అనుమానాస్పదంగా తిరుగుతూ రైల్వే స్టేషన్లు, సైనిక స్థావరాల వద్ద ఫొటోలు, వీడియోలు తీస్తున్నారని స్థానికుల నుంచి పోలీసులకు సమాచారం అందింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి మొబైల్ ఫోన్లను పరిశీలించగా, కీలకమైన రహస్య సమాచారాన్ని సేకరించి ఎవరితోనో పంచుకుంటున్నట్లు ఆధారాలు లభించాయి. ఈ దర్యాప్తు మరింత లోతుగా సాగడంతో, వీరి వెనుక ఒక పెద్ద గూఢచర్య ముఠా ఉందని అధికారులు గుర్తించారు.
ఇప్పటి వరకు 22 మంది అరెస్ట్
ఇప్పటి వరకు ఈ కేసులో మొత్తం 22 మందిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్లు, డిజిటల్ పరికరాల్లో సైనిక స్థావరాలకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు మాత్రమే కాకుండా లొకేషన్ ట్యాగ్లు కూడా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ సమాచారం దేశ భద్రతకు ముప్పు కలిగించేలా ఉండటంతో, దర్యాప్తును లోతుగా కొనసాగిస్తున్నారు. ఎవరు వీరిని ప్రోత్సహిస్తున్నారు అన్న దానిపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టారు.
సోషల్ మీడియా ద్వారా ఎర..
పోలీసుల ప్రాథమిక విచారణలో, కొందరు నిందితులు డబ్బు ఆశతో ఈ పనుల్లో పాల్గొన్నట్లు తెలిసింది. సోషల్ మీడియా, మెసేజింగ్ యాప్ల ద్వారా విదేశీ వ్యక్తులు వారిని సంప్రదించి, చిన్న చిన్న పనుల పేరుతో మొదలుపెట్టి, తర్వాత రహస్య సమాచారాన్ని సేకరించేలా ప్రేరేపించినట్లు సమాచారం. యువతను లక్ష్యంగా చేసుకుని ఇలాంటి గూఢచర్య కార్యకలాపాలు సాగుతున్నాయన్న విషయం ఈ కేసు ద్వారా బయటపడింది.
భద్రతా సంస్థల అలర్ట్
ఈ ఘటనతో భద్రతా సంస్థలు మరింత అప్రమత్తమయ్యాయి. ముఖ్యంగా సైనిక స్థావరాలు, రైల్వే స్టేషన్లు వంటి కీలక ప్రదేశాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. అనుమానాస్పదంగా ఫోటోలు లేదా వీడియోలు తీసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. సాధారణ ప్రజలు కూడా ఇలాంటి అనుమానాస్పద కార్యకలాపాలను గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
