దివ్యాంగుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించే ‘దివ్యాంగ శక్తి’ పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం ప్రారంభించారు. గుంటూరు జిల్లా మంగళగిరి బస్టాండ్లో ఈ పథకాన్ని ప్రారంభించిన అనంతరం, సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేష్లతో కలిసి దివ్యాంగులతో బస్సులో ప్రయాణం చేశారు. మంగళగిరి నుంచి పెనుమాక వరకు సుమారు 11 కిలోమీటర్ల మేర ఈ ప్రయాణం సాగింది. ఈ సందర్భంగా దివ్యాంగులతో ప్రత్యక్షంగా మాట్లాడిన సీఎం వారి సమస్యలు, అవసరాలు గురించి తెలుసుకున్నారు. బస్సు ప్రయాణం డాన్ బాస్కో పాఠశాల, డోలాస్ నగర్, ప్రకాశ్ నగర్, నులకపేట, ఉండవల్లి సెంటర్ మీదుగా సాగి చివరకు పెనుమాక బస్టాప్కు చేరుకుంది. మార్గమధ్యంలో రోడ్డుపై నిలబడ్డ ప్రజలకు అభివాదం చేస్తూ నేతలు ముందుకు సాగారు. పథకం ప్రారంభం సందర్భంగా పెద్ద సంఖ్యలో ప్రజలు, కూటమి పార్టీల కార్యకర్తలు, లబ్దిదారులు హాజరయ్యారు.
ఇప్పటివరకు ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు 50 శాతం రాయితీ మాత్రమే ఉండగా, ఇకపై పూర్తిగా ఉచిత ప్రయాణం అందించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఈ నిర్ణయాన్ని అమలు చేస్తూ గత నెలలో జరిగిన కేబినెట్ సమావేశంలో ఆమోదం పొందింది. అనంతరం మార్చి 18 నుంచి ఈ పథకాన్ని అమలులోకి తీసుకువచ్చారు. దివ్యాంగులకు సమాన అవకాశాలు కల్పించడం, వారి ప్రయాణాన్ని సులభతరం చేయడం, వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. ఈ పథకం ద్వారా ఆర్టీసీకి చెందిన సిటీ సాధారణ, మెట్రో ఎక్స్ ప్రెస్, పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్ బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణం అందుబాటులోకి వచ్చింది.
మొత్తం 21 కేటగిరీల్లో 40 శాతం కంటే ఎక్కువ వైకల్యం కలిగిన దివ్యాంగులు ఈ పథకానికి అర్హులు. వారి వెంట సహాయకులుగా వచ్చే వారికి కూడా ఈ సదుపాయం వర్తిస్తుంది. ఈ పథకం ద్వారా సుమారు 12.76 లక్షల మంది లబ్దిదారులు ప్రయోజనం పొందనున్నారు. ఈ కార్యక్రమం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం ఏటా రూ.207 కోట్లు ఖర్చు చేయనుంది. దీని ద్వారా దివ్యాంగుల జీవన ప్రమాణాలు మెరుగుపడటమే కాకుండా, సమాజంలో వారి భాగస్వామ్యం కూడా పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
ఇక మహిళల కోసం అమలు చేస్తున్న స్త్రీ శక్తి పథకం కూడా విజయవంతంగా కొనసాగుతోంది. గత సంవత్సరం ఆగస్టు 15న ప్రారంభించిన ఈ పథకం ద్వారా మహిళలకు ఆర్థిక వెసులుబాటు కల్పించడంతో పాటు, సాధికారతను పెంచే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ ఏడాది మార్చి 15 నాటికి, అంటే 7 నెలల వ్యవధిలోనే మహిళలు సుమారు 52 కోట్ల ప్రయాణాలు ఉచితంగా చేశారు. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు రూ.1,826 కోట్లు భరించింది. ఈ రెండు పథకాల ద్వారా సామాజిక సమానత్వం, ఆర్థిక బలోపేతం దిశగా ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ALSO READ: ఆధార్కార్డ్ వివరాలు ఫ్రీగా అప్డేట్ చేసుకోవచ్చు..
