క్రైమ్ మిర్రర్, తెలంగాణ స్టేట్ బ్యూరో: అల్లు అర్జున్ కేవలం వెండితెర పైనే కాకుండా, నిజ జీవితంలో కూడా తన సేవా గుణంతో ఎందరికో ఆదర్శంగా నిలిచారు. కాకినాడ జిల్లా వేట్లపాలెంలో జరిగిన ప్రమాదంలో తండ్రిని కోల్పోయిన దుర్గ అనే మానసిక దివ్యాంగురాలి బాధ్యతను స్వీకరించారు.
ఆమె పోషణ కోసం నెలకు రూ. 7,500 ఆర్థిక సాయం అందజేస్తున్నారు. అలాగే తీవ్ర అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న సీనియర్ నటి పావలా శ్యామలకు అండగా నిలిచారు. ఆమె వైద్యం, నిత్యావసర ఖర్చుల కోసం ప్రతి నెలా రూ. 10,000 అందేలా శాశ్వత ఏర్పాట్లు చేశారు.
‘పుష్ప-2’ ప్రీమియర్ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో మరణించిన మహిళ కుటుంబానికి రూ. 2 కోట్లు (అల్లు అర్జున్ రూ. 1 కోటి, చిత్ర యూనిట్ మరో కోటి) ఆర్థిక సాయం ప్రకటించారు. అలాగే గాయపడిన బాలుడి వైద్య ఖర్చులు మరియు భవిష్యత్తు కోసం నిధిని ఏర్పాటు చేశారు.
తన కుటుంబ వేడుకలకు అభిమానులను ఆహ్వానించడం, ఆపదలో ఉన్న అభిమానుల కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలవడం ఆయన ప్రత్యేకత. అల్లు అర్జున్ తన ఫ్యాన్స్ అసోసియేషన్ ద్వారా ఏటా ఒక మంచి పని చేయాలని అభిమానులకు పిలుపునిస్తూ, సేవా కార్యక్రమాల్లో వారిని భాగస్వామ్యం చేస్తున్నారు.
