* తెరపైకి నాగబాబు పేరు
* సీఎం చంద్రబాబు భేటీలో పవన్ ప్రత్యేక ప్రస్తావన
* ముఖ్యమంత్రి అంగీకారం
క్రైమ్ మిర్రర్, ఏపీ: తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ మారనున్నారా? ఇటీవల జరిగిన పరిణామాలతో చైర్మన్ బిఆర్ నాయుడును మార్చుతారా? అలా జరుగుతున్న ప్రచారంలో నిజం ఎంత? మార్చితే ఎవరికి అవకాశం ఇస్తారు? తిరిగి టిడిపి అధ్యక్ష పదవి భర్తీ చేస్తుందా? లేకుంటే జనసేనకు కేటాయిస్తారా? లేకుంటే బీజేపీ కోటా కింద విడిచిపెడతారా? ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఇటీవల సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ జరిపిన సంగతి తెలిసిందే. దాదాపు వారి మధ్య రెండు గంటల పాటు సమావేశం జరిగింది. అయితే అభివృద్ధికి సంబంధించిన అంశాలపై చర్చించినట్లు పవన్ కళ్యాణ్ చెబుతున్నారు. కానీ ఏపీలో రాజకీయాలపై వారిద్దరూ చర్చించారని.. కీలక విషయాల్లో ఒక నిర్ణయానికి వచ్చారని ప్రచారం నడుస్తోంది.
మార్పు అనివార్యం..
ప్రధానంగా టిటిడి చైర్మెన్ మార్పు అనివార్యమని ఒక ప్రచారం అయితే మాత్రం జరుగుతోంది. ప్రస్తుత అధ్యక్షుడు బి.ఆర్ నాయుడు పై వచ్చిన ఆరోపణలు నేపథ్యంలో కూటమికి డ్యామేజ్ జరిగిందని ఆ ఇద్దరు నేతలు ఒక అభిప్రాయానికి వచ్చినట్లు పొలిటికల్ సర్కిల్లో ఒక ప్రచారం నడుస్తోంది. ఈ పరిస్థితుల్లో బిఆర్ నాయుడు మార్పు ఉంటుందన్న టాక్ ఉంది. అయితే ఈసారి మాత్రం టీటీడీ అధ్యక్ష పదవి జనసేన కోటాకు విడిచి పెట్టాలని పవన్ కళ్యాణ్ కోరినట్లు తెలుస్తోంది. తమ పార్టీకి విడిచి పెడితే ఆ పదవిలో ప్రముఖ వ్యక్తిని కూర్చోబెడతానని పవన్ కళ్యాణ్ ప్రతిపాదన పెట్టినట్లు సమాచారం. అయితే బయట వ్యక్తులు అయితే వివాదాస్పద అంశాలు వెలుగులోకి వస్తున్నాయని.. అందుకే సొంత వ్యక్తిని కూర్చోబెడతామని ఆ ఇద్దరు నేతలు ఒక్క సూత్రప్రాయ అంగీకారానికి వచ్చినట్లు సమాచారం.
సోషల్ మీడియాలో హల్ చల్..
టీటీడీ నూతన అధ్యక్షుడిగా నాగబాబు అయితే ఎలా ఉంటుందన్న చర్చ వారి మధ్య వచ్చినట్లు సమాచారం. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో నాగబాబును రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకోవడం కంటే.. టీటీడీ అధ్యక్ష పదవిలో కూర్చోబెట్టడం మేలన్న నిర్ణయానికి వచ్చినట్లు పొలిటికల్ వర్గాల్లో హల్చల్ చేస్తోంది. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో సైతం ఇదే ప్రచారం నడుస్తోంది. నాగబాబును రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకుంటామని చెప్పి ఏడాదిన్నర అవుతోంది. ఇంకోవైపు ఆయనను ఎమ్మెల్సీ చేసి ఏడాది అవుతోంది. అయితే క్యాబినెట్ లోకి తీసుకోవడం ద్వారా బంధు ప్రీతి అనే ముద్రను ప్రత్యర్థులు వేసే అవకాశం ఉంది. అందుకే నాగబాబును టీటీడీ అధ్యక్షుడిని చేసి అటువంటి విమర్శలు రాకుండా చూసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. పైగా టీటీడీ అధ్యక్షుడిగా సొంత మనిషి ఉంటే చాలా జాగ్రత్తగా ఉంటారని ఆ ఇద్దరు నేతలు ఒక ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
తొలుత ఆయన పేరే..
వాస్తవానికి టిడిపి కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే నాగబాబు పేరు టిటిడి అధ్యక్ష పదవికి వినిపించింది. కానీ ఆయనకు కేంద్ర రాజకీయాలు అంటే ఇష్టం. రాజ్యసభ కు వెళ్లాలన్న ఆసక్తి ఎక్కువగా ఉండేది. అయితే అది కుదరకపోయేసరికి రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకుంటామని చంద్రబాబు ప్రకటించారు. అయితే ఇప్పుడు ఎమ్మెల్సీ పదవితో పాటు టీటీడీ అధ్యక్ష స్థానంతో నాగబాబును సంతృప్తి పరిష్కారాన్ని తెలుస్తోంది. మరి ఇందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.
