నల్లగొండ,క్రైమ్ మిర్రర్:- నల్లగొండ జిల్లా పోలీస్ శాఖ గర్వించదగ్గ రీతిలో, టూ టౌన్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న, ప్రతిభావంతమైన కబడ్డీ క్రీడాకారిణి షైక్ నౌషీన్ జాతీయ స్థాయికి ఎంపికయ్యారు. జమ్మూ అండ్ కాశ్మీర్ వేదికగా, మార్చి 7 నుండి 13 వరకు జరగనున్న, ఆల్ ఇండియా పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ – 2026 లో, ఆమె తెలంగాణ రాష్ట్ర పోలీస్ జట్టుకు కెప్టెన్గా నాయకత్వం వహించనున్నారు.
ఇటీవల గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం, సైబరాబాద్ పోలీస్ పరేడ్ గ్రౌండ్స్లో జరిగిన 4వ తెలంగాణ పోలీస్ స్పోర్ట్స్ మీట్లో, యాదాద్రి-V జోన్ తరపున ఆడిన నౌషీన్ జట్టుకు బంగారు పతకం అందించారు. అలాగే 3వ పోలీస్ స్టేట్ మీట్లో రజత పతకం సాధించి తన సత్తా చాటారు. ఈ రెండు టోర్నీల్లోనూ ఆమె కెప్టెన్గా, వ్యవహరించి జట్టును ముందుండి నడిపించడం విశేషం. షైక్ నౌషీన్ కబడ్డీ క్రీడలో అపారమైన అనుభవం కలిగి ఉన్నారు. ఇప్పటివరకు 20 సార్లు జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్న ఆమె, మూడు సార్లు ప్రతిష్టాత్మకమైన ఇండియన్ క్యాంప్స్కు ఎంపికై తన నైపుణ్యాన్ని మెరుగుపరుచుకున్నారు. గత ఏడాది పంజాబ్లోని జలంధర్లో జరిగిన, ఆల్ ఇండియా పోలీస్ మీట్లోనూ ఆమె తెలంగాణ జట్టుకు సారథ్యం వహించి అందరి ప్రశంసలు అందుకున్నారు.
జిల్లా ఎస్పీ పవార్ అభినందనలు.. నౌషీన్ సాధించిన ఈ విజయం పట్ల జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్ హర్షం వ్యక్తం చేశారు. ఆమెను ప్రత్యేకంగా అభినందిస్తూ, జమ్మూ కాశ్మీర్లో జరిగే జాతీయ పోటీల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి రాష్ట్రానికి, జిల్లా పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా జిల్లా పోలీస్ అధికారులు, సిబ్బంది ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.
