మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా చేపడుతున్న సైనిక చర్యలపై అంతర్జాతీయ వేదికపై స్పందనలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా చైనా, రష్యా తమ అభిప్రాయాలను బహిరంగంగా వెల్లడించాయి. ఖమేనీపై దాడులు చేయడం నైతిక విలువలకు విరుద్ధమని, చర్చలు కొనసాగుతున్న సమయంలో సైనిక చర్యలు చేపట్టడం సమస్యను మరింత క్లిష్టతరం చేస్తుందని అవి పేర్కొన్నాయి.
ఇరాన్లో పాలనా మార్పు లక్ష్యంగా దాడులు కొనసాగించడం సరైన దారి కాదని చైనా స్పష్టం చేసింది. వివాదాలను శాంతియుత చర్చల ద్వారానే పరిష్కరించాలనే తన వైఖరిని మళ్లీ వెల్లడించింది. వెంటనే దాడులను నిలిపివేసి చర్చల బాట పట్టాలని పిలుపునిచ్చింది. ప్రాంతీయ స్థిరత్వం దెబ్బతింటే దాని ప్రభావం ప్రపంచ ఆర్థిక, భద్రతా వ్యవస్థలపై పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.
ఇక మరోవైపు ఇరాన్ కూడా ప్రతీకార చర్యలను తీవ్రతరం చేస్తోంది. ఇజ్రాయిల్ మరియు అమెరికాకు చెందిన వ్యూహాత్మక లక్ష్యాలపై భీకర దాడులు కొనసాగుతున్నాయని సమాచారం. గల్ఫ్ దేశాల పరిధిలోనూ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిణామాలతో ఆ ప్రాంత దేశాలు అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి.
తాజాగా UK ఆధీనంలో ఉన్న స్పైప్రస్ దీవిపై క్షిపణి దాడి జరిగినట్లు వెల్లడైంది. ఈ దాడిని యూకే అధికారులు అధికారికంగా ధృవీకరించినట్లు నివేదికలు చెబుతున్నాయి. దీంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. మధ్యప్రాచ్యంలోని ఘర్షణలు ఇప్పుడు యూరప్ సరిహద్దులను కూడా తాకుతున్నాయనే భావన వ్యక్తమవుతోంది.
ఈ పరిణామాలన్నీ కలిపి చూస్తే ప్రాంతీయ ఘర్షణ అంతర్జాతీయ స్థాయికి వ్యాపించే ప్రమాదం ఉందన్న ఆందోళనలు పెరుగుతున్నాయి. ఒకవైపు దాడులు, మరోవైపు ఖండనలు, శాంతి చర్చల పిలుపులు ఇలా పరిస్థితి అనిశ్చిత దశలో కొనసాగుతోంది. ప్రపంచ దేశాలు పరిణామాలను నిశితంగా గమనిస్తూ, ఉద్రిక్తతలు మరింత పెరగకుండా రాజనీతిక మార్గాలను అన్వేషిస్తున్నాయి.
ALSO READ: ఖమేనీ మరణించినా వెనక్కి తగ్గని ఇరాన్.. బూర్జ్ ఖలీఫా మీదుగా మిస్సైల్స్
