ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని నహ్తౌర్ ప్రాంతం పరిధిలోని కైపట్ల గ్రామంలో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. కుటుంబ నమ్మకాన్ని ద్రోహంగా మలచిన అల్లుడి క్రూర చర్యలు స్థానికంగా తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తిస్తున్నాయి. గ్రామానికి చెందిన సంతోష్ వర్మ తన చెవిటి, మూగ కుమార్తె భవిష్యత్తు భద్రంగా ఉండాలని భావించి నవీన్ అనే వ్యక్తిని అల్లుడిగా ఇంట్లో చేర్చుకున్నాడు. తన కుమార్తెకు అండగా నిలుస్తాడని నమ్మి కుటుంబ సభ్యుడిగా గౌరవం ఇచ్చాడు. ప్రారంభంలో సాధారణంగానే ఉన్న అతని ప్రవర్తన క్రమంగా మారిపోయింది. మద్యానికి బానిసైన నవీన్ ఇంట్లో కలహాలు సృష్టించడంతో కుటుంబంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పరిస్థితి అదుపు తప్పడంతో సుమారు 2 నెలల క్రితం అతన్ని ఇంటి నుంచి వెళ్లగొట్టారు.
అయితే ఫిబ్రవరి 25 బుధవారం మరల ఇంటి వద్దకు చేరుకున్న నవీన్ గత తప్పులకు క్షమాపణలు కోరుతూ మళ్లీ కలిసి జీవించాలని వేడుకున్నాడు. కుటుంబ సభ్యులు అతని మాటలను నమ్మి మరోసారి ఇంట్లోకి అనుమతించారు. ఇదే అతను పన్నిన కుట్రకు ఆరంభమైంది. ఆ రోజు రాత్రి ఇంట్లో వండిన ఆహారంలో విషపదార్థం కలిపి తన అత్తామామలకు, భార్యకు అందించాడు. ఆహారం తీసుకున్న కొద్దిసేపటికే వారికి అస్వస్థత కలగడంతో పరిస్థితి విషమించింది. కుటుంబ సభ్యులు ఏమి జరుగుతోందో అర్థం చేసుకునేలోపే నవీన్ తన అసలు రూపాన్ని బయటపెట్టాడు.
ఇంటి లోపల భద్రపరిచిన సుమారు రూ.2 కోట్ల విలువైన అర కిలో బంగారం, 40 కిలోల వెండి ఆభరణాలను సేకరించి అక్కడి నుంచి పరారయ్యాడు. విషప్రయోగంతో బాధపడుతున్న కుటుంబ సభ్యులను పొరుగువారు గమనించి వెంటనే ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. ప్రస్తుతం బాధితులు చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడి కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.
ALSO READ: రెండో పెళ్లి చేసుకోవాలని 9 నెలల గర్భిణిని చంపిన భర్త
