హైదరాబాద్, క్రైమ్ మిర్రర్: తెలంగాణ సచివాలయంలో ప్రభుత్వ ఉద్యోగులు భారీ నిరసన చేపట్టారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ భారీ ధర్నా నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ పిలుపు మేరకు, సచివాలయం ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యోగులు నల్ల రిబ్బన్లు ధరించి తమ నిరసనను వ్యక్తం చేశారు. మధ్యాహ్న భోజన విరామ సమయంలో పెద్ద ఎత్తున మహా ధర్నా నిర్వహించి తమ ఆవేదన తెలిపారు.
ఈ సందర్భంగా ఉద్యోగులు పలు ప్రధాన డిమాండ్లు ముందుకు తెచ్చారు. 52 శాతం ఫిట్మెంట్తో పీఆర్సీని అమలు చేయాలని, ప్రభుత్వ ఉద్యోగులకు మెరుగైన హెల్త్ స్కీమ్ను వెంటనే అమలు చేయాలని కోరారు. అలాగే పెండింగ్లో ఉన్న బిల్లులను తక్షణమే చెల్లించాలని, కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్)ను రద్దు చేసి పాత పెన్షన్ విధానం (ఓపీఎస్)ను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
పెండింగ్లో ఉన్న డీఏలను వెంటనే విడుదల చేయాలని కూడా ప్రభుత్వం ముందు డిమాండ్ ఉంచారు.ప్రభుత్వం వెంటనే స్పందించి ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని హెచ్చరించిన ఉద్యోగ సంఘాలు, తమ డిమాండ్లు నెరవేర్చకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశాయి.
