హైదరాబాద్, క్రైమ్మిర్రర్: హైదరాబాద్లో రెండెళ్ల నాటికి 3వేల ఈవీ బస్సులు నడుపాలని ఆర్టీసీ యాజమాన్యం లక్ష్యంగా పెట్టుకుంది. దీనికి నుగుణంగానే . 2027 డిసెంబరు నాటికి గ్రేటర్జోన్ను ఈవీ జోన్గా మారుస్తామని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఈ దిశగా ఆర్టీసీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. గ్రేటర్ రోడ్లపై ఇప్పటికే 450 ఈవీ బస్సులు నడుపుతున్న ఆర్టీసీ.. పీఎం ఈ డ్రైవ్ పథకం కింద అద్దె ప్రాతిపదికన 1500 ఈవీ బస్సులు, రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో మరో 1500 ఎలక్ర్టిక్ బస్సులను సొంతంగా సమకూర్చుకునే ప్రయత్నాలు చేస్తోంది.
గ్రేటర్లో రోజూ 25 లక్షలమంది ప్రయాణికులకు ఆర్టీసీ సేవలందిస్తోంది. వారీలో 18లక్షల మంది మహిళలు మహాలక్ష్మి పథకంతో ఉచిత ప్రయాణాలు సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో మహాలక్ష్మి ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా బస్సులు పెంచుకునేదిశగా ఆర్టీసీ చర్యలు తీసుకుంటుంది.
26బస్ డిపోలో ఈవీ చార్జింగ్ స్టేషన్లు…
గ్రేటర్జోన్పై టీజీఎస్ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి ప్రత్యేక దృష్టిసారించారు. గ్రేటర్జోన్ ను విస్తరించడంతో పాటు 26 బస్ డిపోల్లో ఈవీ చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నారు. వచ్చే రెండేళ్లలో గ్రేటర్జోన్లో కేవలం ఎలక్ర్టిక్ బస్సులు మాత్రమే నడపాలని, ఓఆర్ఆర్ అవతల మాత్రమే డీజిల్ బస్సులు నడిపేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. శివార్ల నుంచి జిల్లాలకు సర్వీసులు నడిపితే ట్రాఫిక్ లేకుండా తక్కువ సమయంలో జిల్లా సర్వీసులు గమ్యస్థానాలకు చేరుకుంటాయని అధికారులు భావిస్తున్నారు.