క్రైమ్ మిర్రర్ : తనను కేంద్ర మంత్రివర్గం నుంచి తప్పించేందుకు కొందరు కుట్ర చేస్తున్నారని కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి జువల్ ఓరమ్ ఆరోపించారు. తన రాజకీయ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు ప్రయత్నించే వారిపై తీవ్ర స్థాయిలో స్పందించిన ఆయన.. తనపై కుట్రలు చేస్తున్నవారి చేతులు నరికేస్తానంటూ హెచ్చరించారు. బీజేపీ జనరల్ సెక్రటరీ మానస్ మొహంతీతో సమావేశం అనంతరం ఓరమ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇతర రాజకీయ పార్టీల నుంచి బీజేపీలోకి వచ్చిన కొందరు నేతలు తనపై వ్యతిరేక ప్రచారం చేస్తున్నారని ఓరమ్ ఆరోపించారు. తనను రాజకీయంగా ఎదుర్కోవాలనుకునే వారు నేరుగా సవాల్ చేయాలని వ్యాఖ్యానించారు. తన ప్రతిష్ఠను దెబ్బతీసే ప్రయత్నాలను మాత్రం సహించబోనని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.
అనుచరుడి అరెస్టు తర్వాత వ్యాఖ్యలు
ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే సర్క్యూట్ హౌస్లో నేర చరిత్ర ఉన్న వ్యక్తులకు ఆశ్రయం కల్పించారనే ఆరోపణల నేపథ్యంలో ఓరమ్ అనుచరుడు ప్రకాశ్ పాశ్వాన్ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ పరిణామం తర్వాతే కేంద్ర మంత్రి తాజా వ్యాఖ్యలు చేయడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. పాశ్వాన్పై చర్యలకు కొనసాగింపుగా బీజేపీ యువమోర్చా రాష్ట్ర కార్యవర్గం నుంచి అతడిని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మన్మోహన్ సమల్ సస్పెండ్ చేశారు.
ఆరుసార్లు ఎంపీగా ఓరమ్
జువల్ ఓరమ్ 1998లో తొలిసారి లోక్సభకు ఎన్నికయ్యారు. ఒడిశాలోని సుందర్గఢ్ నియోజకవర్గం నుంచి ఆయన ఇప్పటివరకు ఆరుసార్లు ఎంపీగా విజయం సాధించారు. కేంద్రంలో గిరిజన వ్యవహారాల శాఖకు ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే కేంద్ర మంత్రి చేసిన తాజా వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు స్పందించాయి. హింసను ప్రోత్సహించేలా ఉన్న బెదిరింపులపై బిజూ జనతాదళ్, కాంగ్రెస్ నేతలు ప్రశ్నలు లేవనెత్తారు. రాజకీయ విభేదాలను ప్రజాస్వామ్య పద్ధతుల్లోనే పరిష్కరించుకోవాలని వారు సూచించారు.
also read : కుక్క మొరగకుండా టేప్.. ఆ తర్వాత ఇంట్లో భారీ దోపిడీ
