క్రైమ్ మిర్రర్ : కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వ్యక్తి తన భార్యను హత్య చేసి.. ఆమె గుండెపోటుతో మృతి చెందినట్లు నమ్మించేందుకు ప్రయత్నించాడు. అయితే పోలీసుల దర్యాప్తులో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఇంటి సమీపంలోని సీసీటీవీ ఫుటేజీ పరిశీలించడంతో నిందితుడి కట్టుకథ బయటపడింది. కర్ణాటకలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కర్ణాటకలోని మంకి గ్రామానికి చెందిన మంగళ (27)కు గణపతి మంజునాథ్ నాయక్తో వివాహమైంది. కొంతకాలంగా భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. మద్యానికి అలవాటు పడిన గణపతి విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు చేస్తుండటంతో దంపతుల మధ్య వివాదాలు తలెత్తేవని పోలీసులు తెలిపారు.
ఈ క్రమంలో ఆగస్టు 25న అర్ధరాత్రి మరోసారి ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో భార్యపై కోపం పెంచుకున్న గణపతి.. ఆమెను హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. తెల్లవారుజామున సుమారు 2 గంటల సమయంలో నిద్రిస్తున్న మంగళపై దాడి చేసి, నోరు, ముక్కును అదిమిపట్టి.. మెడకు తాడు బిగించి హత్య చేసినట్లు దర్యాప్తులో తేలింది.
గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నం
హత్య విషయం బయటకు రాకుండా గణపతి ఓ పథకం వేశాడు. మంగళకు అకస్మాత్తుగా గుండెపోటు వచ్చిందని ఇంట్లోని కుటుంబ సభ్యులను నమ్మించాడు. అనంతరం ఆమె తల్లిదండ్రులకు ఫోన్ చేసి.. గుండెపోటు రావడంతో ఆటోలో ఆసుపత్రికి తీసుకెళ్లానని, మార్గమధ్యంలోనే ఆమె మృతి చెందడంతో తిరిగి ఇంటికి తీసుకొచ్చానని చెప్పాడు. అయితే గణపతి చెప్పిన విషయాలపై మంగళ సోదరికి అనుమానం వచ్చింది. దీంతో ఆమె మంకి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
సీసీటీవీతో బయటపడిన నిజం
దర్యాప్తులో భాగంగా పోలీసులు ఘటన జరిగిన ఇంటి సమీపంలోని భవనంలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలను పరిశీలించారు. ఆ ఫుటేజీలో గణపతి చెప్పినట్లు ఆ రాత్రి ఆటోను ఇంటి నుంచి బయటకు తీసుకెళ్లిన ఆనవాళ్లు కనిపించలేదు. దీంతో పోలీసులకు గణపతిపై అనుమానం మరింత బలపడింది. అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా.. భార్య మంగళను తానే హత్య చేసినట్లు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. దీంతో గుండెపోటుగా నమ్మించేందుకు చేసిన ప్రయత్నం సీసీటీవీ ఆధారాలతో బయటపడింది.
also read : రిషబ్ శెట్టి ఖాతాలో అరుదైన రికార్డు.. ఫోర్బ్స్ టాప్-100లో చోటు!
