రంగారెడ్డి, క్రైమ్ మిర్రర్:అబ్దుల్లాపూర్మెట్ మండల పరిధిలోని కనకదుర్గ కాలనీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.తండ్రి మరణాన్ని తట్టుకోలేక కొడుకు ఉరేసుకుని ఆత్మహత్యకి పాల్పడగా కొడుకు శవాన్ని చూసి తట్టుకోలేక తల్లి అక్కడే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న హృదయ విదారక ఘటన అందరిని కలిచివేసింది. కనకదుర్గ కాలనీకి చెందిన కళావతి , ఆమె కుమారుడు శివ నివాసముంటున్నారు.గత ఆరు నెలల క్రితం కళావతి భర్త హఠాన్మరణం చెందడంతో ఆ కుటుంబం తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది. కుటుంబ పెద్దను కోల్పోయిన నాటి నుండి తల్లి, కొడుకు ఇద్దరూ తీవ్ర మానసిక వేదన అనుభవిస్తున్నారు.
ఈ క్రమంలోనే జీవితంపై విరక్తి చెందిన కుమారుడు శివ, ఇంట్లోని ఫ్యాన్కు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. కండ్ల ముందే కొడుకు శవమై వేలాడటం చూసి తట్టుకోలేకపోయిన తల్లి కళావతి, తీవ్ర మనస్తాపంతో అదే చీరతో పక్కనే ఉరివేసుకుని ప్రాణాలు విడిచింది.ఒకే ఇంట్లో తల్లి, కొడుకు ఇద్దరూ శవాలుగా మారిన విషయం తెలుసుకున్న కాలనీవాసులు కన్నీరుమున్నీరవుతున్నారు. సమాచారం అందుకున్న అబ్దుల్లాపూర్మెట్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.ఆరు నెలల వ్యవధిలోనే ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి చెందడంతో కనకదుర్గ కాలనీలో విషాద ఛాయలు అలముకున్నాయి.