-
టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవితను చంపే కుట్ర
-
కవిత అరెస్ట్ సందర్భంగా పోలీసుల ఓవరాక్షన్ పై విచారణ జరపాలి
-
బాధ్యులైన అధికారులను సస్పెండ్ చేసి చర్యలు తీసుకోవాలి
-
కవిత ఉద్యమాలు ప్రజలకు చేరకుండా గుంపుమేస్త్రీ, గుంటనక్క కుమ్మక్కు
-
టీఆర్ఎస్ నాయకులు రూప్ సింగ్, ఇస్మాయిల్, చిలుక ప్రవీణ్
క్రైమ్ మిర్రర్, హైదరాబాద్: తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ను చంపే కుట్ర ప్రభుత్వం చేసిందని టీఆర్ఎస్ నాయకులు రూప్ సింగ్, ఇస్మాయిల్, చిలుక ప్రవీణ్ ఆరోపించారు. బంజారాహిల్స్ లోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ఉద్యమకారుల తరఫున పోరాటం చేసిన కవిత గారికి టార్గెట్ చేసి చంపే కుట్ర చేశారంటూ వారు మండిపడ్డారు.
నిన్న జరిగిన మొత్తం ఘటనపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాల్సిందేనని డిమాండ్ చేశారు. కవిత గారు ఎప్పుడూ ప్రజా పోరాటం చేసిన సరే గుంపుమేస్త్రీ, గుంటనక్కలు కుమ్మక్కై ఆ అంశాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
-
ఇంత దుర్మార్గం సమైక్యాంధ్రాలో కూడా లేదు- రూప్ సింగ్
ఉద్యమకారుల కోసం పోరాటం చేస్తున్న కవిత గారి పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరించిన తీరు అత్యంత బాధాకరమని రూప్ సింగ్ అన్నారు. సమైక్యాంధ్రా లో కూడా ఇంత దుర్మార్గం జరగలేదన్నారు. ఉద్యమకారులకు ఇస్తామన్న హామీలు అమలు చేయకుండా మోసం చేసిన రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తే కవిత గారిని టార్గెట్ చేశారన్నారు.
ఒక మహిళ, మాజీ ఎంపీ, ఎమ్మెల్సీ అని కూడా చూడకుండా ఆమె పట్ల అమానుషంగా వ్యవహరించారని ఆవేదన వ్యక్తం చేశారు. కవిత గారి అరెస్ట్ సందర్భంగా ఓవరాక్షన్ చేసిన అధికారులందరిపై చర్యలు తీసుకోవాలని రూప్ డిమాండ్ చేశారు. లేదంటే ప్రజలు, ఉద్యమకారుల మద్దతుతో ఈ ప్రభుత్వం పై మరింత ఉధృతంగా పోరాటం చేస్తామని హెచ్చరించారు.
-
చంపే కుట్ర చేసినట్లు అనుమానం ఉంది – ఇస్మాయిల్
కవిత గారిని నిన్న అరెస్ట్ చేసిన విధానం చూస్తుంటే ఆమెను టార్గెట్ చేసి చంపే కుట్ర చేసినట్లు అనుమానం కలుగుతోందని ఇస్మాయిల్ అన్నారు. ఈ మొత్తం ఘటనపై నిష్పాక్షికంగా విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాల్సిందేనని ప్రభుత్వాన్ని కోరారు. ప్రజా సమస్యలపై ఉద్యమం చేసిన వాళ్లపై గతంలో చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డి ఇలాగే వ్యవహరిస్తే వాళ్లను ఓడించి ప్రజలు తగిన బుద్ది చెప్పారన్నారు.
ఉద్యమకారులను పట్టించుకోని కేసీఆర్ ను కూడా ఓడించారని గుర్తు చేశారు. ఉద్యమకారుల తరఫున భూపోరాటం చేపట్టిన కవిత గారి పట్ల కూడా కాంగ్రెస్ అమానుషంగా వ్యహరించిందని ఇస్మాయిల్ అన్నారు. కచ్చితంగా రేవంత్ సర్కార్ కు ప్రజలు బుద్ది చెబుతారన్నారు.
కవిత గారి పట్ల ప్రభుత్వం వ్యవహారించిన తీరును మొత్తం తెలంగాణ సమాజం ముక్తకంఠంతో ఖండించిందని చెప్పారు. కవిత గారికి, ఉద్యమకారులకు రేవంత్ సర్కార్ క్షమాపణ చెప్పాలని ఇస్మాయిల్ కోరారు. అదే విధంగా ఉద్యమకారులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలన్నారు.
-
గుంపు మేస్త్రీ, గుంటనక్క కుమ్మక్కు- చిలుక ప్రవీణ్
కవిత గారు ప్రజ సమస్యలపై పోరాటం చేపట్టిన ప్రతిసారీ గుంపు మేస్త్రీ, గుంటనక్క కుమ్మక్కై ఆ పోరాటాన్ని నిర్వీర్యం చేసే కుట్ర చేస్తున్నారని చిలుక ప్రవీణ్ అన్నారు. కవిత గారు ఉద్యమకారుల కోసం భూ పోరాటం చేసిన రోజే హరీష్ రావు, గుంపు మేస్త్రీ కుట్ర చేసి ఛాలెంజ్ లు విసురుకున్నారన్నారు. అసెంబ్లీ వేదికగా చేయాల్సిన చర్చలను పార్టీ కార్యాలయం, గన్ పార్క్ వద్ద అంటూ డ్రామాలు చేశారన్నారు.
ఛాలెంజ్ చేసే వ్యక్తి వేరే పార్టీ నాయకున్ని తమ పార్టీ కార్యాలయానికి చర్చకు రమ్మని పిలుస్తారా? అని ప్రశ్నించారు. కేటీఆర్, గుంటనక్క, గుంపు మేస్త్రీ గాల్లో కత్తులు తిప్పుకుంటూ ప్రజా సమస్యలను పక్కదోవ పట్టిస్తున్నారన్నారు. కవిత గారు బాయిబాట పట్టిన సందర్భంలో కూడా గుంటనక్క ఇలాంటి ప్రయత్నాలే చేశాడన్నారు.
కవిత గారి పోరాటాలను ప్రజలకు చేరకుండా గుంపు మేస్త్రీ, గుంటనక్కలు కుట్ర చేస్తున్నారని ప్రవీణ్ అన్నారు. ఒక మహిళ ప్రాణాలకు తెగించి పోరాటం చేస్తుంటే అంత భయమెందుకని ప్రశ్నించారు. పదేళ్లు అధికారంలో కులుకిన బీఆర్ఎస్ నేతలు ఉద్యమకారులకు అన్యాయం చేశారని ప్రవీణ విమర్శించారు. ఇవ్వాళ వారికి న్యాయం చేసేందుకు కవిత పోరాటం చేస్తే ఆ పోరాటాన్ని కూడా నిర్వీర్యం చేసే కుట్ర చేస్తారా అని ప్రశ్నించారు.
మీ కుట్రలను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని తగిన సమయంలో కచ్చితంగా బుద్ధి చెబుతారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున భూ పోరాటం కవిత గారి ఆధ్వర్యంలోనే జరిగిందని…అది తట్టుకోలేక రేవంత్ ప్రభుత్వం దాష్టీకానికి పాల్పడిందని ప్రవీణ్ విమర్శించారు. కవిత గారి పట్లనే కాకుండా బీఆర్ఎస్ మహిళ నేతలపై కూడా పోలీసులు అమానుషంగా వ్యవహరించారని వారిపై కచ్చితంగా చర్యలు తీసుకోవాలని ప్రవీణ్ డిమాండ్ చేశారు.