క్రైమ్ మిర్రర్,గుడివాడ:- తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్లపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కొడాలి నాని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గుడివాడలో నిర్వహించిన వైఎస్సార్సీపీ భారీ ర్యాలీలో పాల్గొన్న ఆయన, టీడీపీ నేతల విమర్శలకు గట్టి కౌంటర్ ఇచ్చారు. వైఎస్సార్సీపీని ‘గొడ్డలి పార్టీ’ అంటూ చంద్రబాబు, లోకేష్లు పిచ్చి కూతలు కూస్తున్నారని ఆయన మండిపడ్డారు.
అసలైన ‘పచ్చ గొడ్డలి పార్టీ’ టీడీపీనే!
సమావేశంలో కొడాలి నాని మాట్లాడుతూ.. “వైఎస్సార్సీపీని విమర్శించే అర్హత చంద్రబాబుకు లేదు. అసలైన పచ్చ గొడ్డలి పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీయే. హిందూ సంప్రదాయంలో గొడ్డలికి ఒక పవిత్రమైన స్థానం ఉంది. దుర్గాదేవి, వినాయకుడు వంటి దేవుళ్ల చేతుల్లో ఆయుధంగా గొడ్డలి ఉంటుంది. దేవుళ్ల చేతిలో ఉండే గొడ్డలి దుష్టశిక్షణకు ప్రతీక” అని వ్యాఖ్యానించారు.
2029లో జగన్ చేతికి పరశురాముడి గొడ్డలి..
రాబోయే ఎన్నికల వ్యూహాన్ని ప్రస్తావిస్తూ కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “రాబోయే 2029 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేతికి పరశురాముడి గొడ్డలిని అందిస్తారు. ఆ గొడ్డలితో పరశురాముడిలా మారి, జగన్ అవినీతిమయమైన తెలుగుదేశం పార్టీకి శాశ్వతంగా రాజకీయ సమాధి కడతారు” అని ధీమా వ్యక్తం చేశారు. గుడివాడ నియోజకవర్గంలో జరిగిన ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో వైఎస్సార్సీపీ శ్రేణులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. చంద్రబాబు కుయుక్తులను ప్రజలు గమనిస్తున్నారని, రానున్న రోజుల్లో వైఎస్సార్సీపీ మరింత బలంగా పుంజుకుంటుందని ఈ సందర్భంగా క్యాడర్లో నాని ఉత్సాహాన్ని నింపారు.