తెలుగు సినిమాను ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందేలా చేసిన దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళికి ఫ్రాన్స్లో అరుదైన గౌరవం లభించింది. ప్రపంచ సినీ చరిత్రలో ప్రత్యేక స్థానం ఉన్న ఫ్రాన్స్లోని ప్రతిష్ఠాత్మక లూమియర్ మ్యూజియంలో ఆయన పేరు శాశ్వతంగా నిలిచిపోయేలా ప్రత్యేక గుర్తింపును అందించారు. ఈ ఘనతతో భారతీయ సినీ పరిశ్రమ మరోసారి అంతర్జాతీయ వేదికపై ప్రశంసలు అందుకుంది.
గతంలో రాజమౌళి తెరకెక్కించిన ‘ఈగ’, ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలు లూమియర్ థియేటర్లో ప్రదర్శించబడినప్పుడు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన లభించింది. ఇప్పుడు అదే వేదికపై ఆయనకు ఘన స్వాగతం లభించడం విశేషంగా మారింది.
ఈ కార్యక్రమంలో కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ డైరెక్టర్ థియరీ ఫ్రేమో స్వయంగా రాజమౌళిని వేదికపైకి ఆహ్వానించి సత్కరించారు. అనంతరం అక్కడ ఉన్న ప్రముఖ దర్శకుల స్మారక గోడ అయిన ‘ముర్ దే సినియాస్ట్స్’ వద్దకు తీసుకెళ్లారు. ప్రపంచ ప్రఖ్యాత దర్శకులు మార్టిన్ స్కోర్సెసీ, క్వెంటిన్ టరంటినో వంటి దిగ్గజాల పేర్లు చెక్కిన అదే గోడపై రాజమౌళి పేరు కూడా ఆవిష్కరించారు.
రెడ్ క్లాత్తో కప్పి ఉన్న ఫలకాన్ని తొలగించగానే తన పేరును చూసిన రాజమౌళి ఆనందంతో భావోద్వేగానికి గురయ్యారు. ఈ గౌరవం తన జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే మధుర జ్ఞాపకమని తెలిపారు. ఇలాంటి అరుదైన గుర్తింపు లభించడం తనకు ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు.
ఈ గౌరవం కేవలం రాజమౌళికే పరిమితం కాదు. తెలుగు సినిమాతో పాటు భారతీయ చలనచిత్ర పరిశ్రమకు కూడా ఇది గొప్ప గుర్తింపుగా సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ప్రపంచ సినీ దిగ్గజాల సరసన భారతీయ దర్శకుడి పేరు నిలవడం దేశానికి గర్వకారణమని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.