
సీనియర్ ఐఏఎస్ అధికారి స్వితా సబర్వాల్.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు ఎందుకు పెడుతున్నారు..? ఒకసారి పెడితే పొరపాటు అనుకోవచ్చు.. పోలీసుల నుంచి నోటీసులు అందుకున్న తర్వాత కూడా పెడితే అర్థమేంటి..? తగ్గేదే లేదంటూ.. మళ్లీ మళ్లీ రీట్వీట్లు ఎందుకు చేస్తున్నారు..? ఆమె అత్యుత్సాహం.. వివాదాలకు దారితీస్తోందా..? పాలనలో భాగమై ఉండి.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్మిత ఎందుకు పోస్టులు పెడుతున్నారు..? ఆమె తీరుపై ఐఏఎస్ వర్గాల్లో పెద్ద చర్చే జరుగుతోంది.
స్మితా సబర్వాల్.. సీనియర్ ఐఏఎస్ అధికారిణి. బీఆర్ఎస్ హయాంలో కీలక పొజిషన్లో ఉన్నారు. సీఎంవో సెక్రటరీగా పనిచేశారు. కాళేశ్వరంతోపాటు ఇరిగేషన్ ప్రాజెక్టులను ఆమె పర్యవేక్షించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక…. సీఎం రేవంత్రెడ్డిని ఐఏఎస్ అధికారులు మర్యాదపూర్వకంగా కలిశారు. కానీ.. స్మితా సబర్వాల్ మాత్రం కాస్త దూరం పాటించారు. చాలా రోజుల వరకు విధులకు దూరంగా ఉన్నారు. ఆ సమయంలో.. ఆమె కేంద్ర సర్వీసులకు వెళ్తారన్న వార్తలు వచ్చాయి. అంతలోనే కథ మలుపు తిరిగింది. తెలంగాణ ప్రభుత్వం ఆమెను ఫైనాన్స్ కమిషనర్ మెంబర్ సెక్రటరీగా.. ఆ తర్వాత టూరిజం, కల్చర్ ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమించింది. అయితే.. ఇటీవల స్మితా సబర్వాల్ పెడుతున్న పోస్టులు వివాదానికి దారి తీస్తున్నాయి.
Also Read : సీఎం రేవంత్ రెడ్డికి గండం!సుప్రీంకోర్టుకు సీఈసీ సంచలన రిపోర్ట్
హలో హైదరాబాద్ అనే ట్విట్టర్ అకౌంటర్లో.. కంచ గచ్చిబౌలి భూములకు సంబంధించిన పోస్టు చేసిన గిబ్లీ ఫొటోను స్మితా సబర్వాల్ రీట్వీట్ చేశారు. ఇది గత నెల అంటే మార్చి 31న జరిగింది. ఆ పోస్టులో గచ్చిబౌలి భూముల్లో బుల్డోజర్లు ఉన్నట్టు.. ఆ బుల్డోజర్ల ముందు నెమళ్లు, జింకలు ఉన్నట్టు సృష్టించారు. అది మార్ఫింగ్ ఫొటో. ఆ ఫొటోలను పాలనలో భాగస్వామిగా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారిణి స్మిత సబర్వాల్ రీట్వీట్ చేయడం.. వివాదాస్పదమైంది. ఆమెకు కంచ గచ్చిబౌలి పోలీసులు నోటీసులు కూడా ఇచ్చారు. అయితే.. స్మితా సబర్వాల్ ఆ నోటీసులపై ఇంకా వివరణ ఇవ్వలేదు. పైగా మరో రెండు, మూడు రీట్వీట్లు చేశారు. అవి కూడా ప్రభుత్వానికి ఒకరకంగా వ్యతిరేకంగానే ఉన్నాయి. తెలంగాణ పోలీసులు సొంత ఐఏఎస్ అధికారికే నోటీసులు ఇస్తారా..? ఇది దేనికి సంకేతం..? అంటూ మహిళలు ప్రశ్నిస్తూ పెట్టిన పోస్టులను స్మితా సబర్వాల్ రీట్వీట్ చేశారు.
Also Read : కొబ్బరిబొండాల కత్తితో ఇద్దరు పిల్లలను నరికేసిన తల్లి.. అసలు కారణం ఇదే
అంతేకాదు.. కంచ గచ్చిబౌలి భూముల్లో రేవంత్రెడ్డి సర్కార్ తొలగించిన 100 ఎకరాలను పునరుద్దరించే ప్లాన్తో రావాలని.. లేకపోతే అధికారులు జైలుకు వెళ్లక తప్పదన్న సుప్రీం కోర్టు ఆదేశాలతో ఉన్న పోస్టును కూడా ఆమె రీట్వీట్ చేశారు. తాజాగా పెట్టిన రీట్వీట్లలోనూ ఏఐతో సృష్టించిన బుల్డోజర్లు, నెమళ్లు, జింకల ఫొటో కూడా ఉంది. దీంతో… స్మితా సబర్వాల్ తీరు వివాదాస్పదమవుతోంది. ఆమె ప్రభుత్వంపైనే తిరుగుబాటు చేస్తున్నారా…? అనే ప్రశ్న తలెత్తుతోంది.
కంచ గచ్చిబౌలికి సంబంధించి ఏఐ ఆధారిత ఫొటోను కేంద్రమంత్రి కిషన్రెడ్డితోపాటు చాలా మంది నేతలు పోస్ట్ చేశారు. అయితే.. ఆ ఫొటో వివాదాస్పదం కావడంతో… వెంటనే తొలగించారు. అయితే.. స్మితా సబర్వాల్ మాత్రం వెనక్కి తగ్గలేదు. పైగా ప్రభుత్వాన్ని తప్పుబట్టేలా ఉన్న పోస్టులను రీట్వీట్ చేస్తూనే ఉన్నారు. దీంతో.. అసలు ఆమె ఉద్దేశం ఏంటి..? ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎందుకు వెళ్తోంది..? అని తోటి ఐఏఎస్లు గుసగుసలాడుకుంటున్నారు.