హైదరాబాద్, క్రైమ్ మిర్రర్: అక్కినేని ఇంటి పెద్ద కోడలు, హీరో నాగ చైతన్య భార్య శోభితా ధూళిపాళ్లకు ఇవాళ మే 31 ప్రత్యేకమైన రోజు. తన అందం, నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ తెలుగమ్మాయి పుట్టినరోజు సందర్భంగా ఆమె జీవితంలోని ఆసక్తికర విషయాలు మరోసారి చర్చకు వస్తున్నాయి. పెళ్లికి ముందే తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న శోభిత ఇప్పుడు అక్కినేని కుటుంబంలోనూ ప్రత్యేక స్థానం సంపాదించారు.
శోభితా ధూళిపాళ్ల తెనాలిలో జన్మించారు. ఆమె తండ్రి వేణుగోపాల రావు మర్చంట్ నేవీలో పనిచేశారు. తల్లి కామాక్షి టీచర్గా పని చేశారు. తండ్రి ఉద్యోగం కారణంగా కుటుంబం విశాఖపట్నానికి వెళ్లడంతో శోభిత అక్కడే పెరిగారు. చిన్నప్పటి నుంచే కళలపై ఆసక్తి పెంచుకున్న ఆమె కూచిపూడి, భరతనాట్యం కూడా నేర్చుకున్నారు. 16 ఏళ్ల వయసులో ముంబైకి వెళ్లి తన కెరీర్ను ప్రారంభించారు.
2013లో ఫెమినా మిస్ ఇండియా ఎర్త్ టైటిల్ గెలుచుకోవడం శోభిత జీవితంలో కీలక మలుపు అయింది. ఆ విజయంతో అంతర్జాతీయ వేదికపై గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత సినిమాల్లోకి అడుగుపెట్టి హిందీ చిత్రాలతో నటిగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టారు.
ఓటీటీలో కూడా శోభిత మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మేడ్ ఇన్ హెవెన్ వెబ్ సిరీస్లో తారా ఖన్నా పాత్రతో ప్రశంసలు అందుకున్నారు. ది నైట్ మేనేజర్లోనూ తన నటనతో ఆకట్టుకున్నారు. ఇటీవల మంకీ మ్యాన్ సినిమాతో హాలీవుడ్లోకి కూడా అడుగుపెట్టారు. అందులో దేవ్ పటేల్తో కలిసి నటించి మరో స్థాయికి చేరుకున్నారు.
అందులో కూడా గ్రేట్…
నటనతో పాటు శోభితకు సంప్రదాయాలపై కూడా మంచి ఆసక్తి ఉంది. ఒకవైపు గ్లోబల్ బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తూనే మరోవైపు భారతీయ చేనేతకు ప్రోత్సాహం అందిస్తున్నారు. ఆధునికత, సంప్రదాయాన్ని సమంగా బ్యాలెన్స్ చేస్తూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను నిర్మించుకున్నారు.
2024 డిసెంబర్ 4న నాగ చైతన్యతో శోభిత వివాహం జరిగింది. ఆ పెళ్లితో అక్కినేని ఇంటి పెద్ద కోడలిగా అడుగు పెట్టిన ఆమె ప్రస్తుతం కుటుంబ జీవితాన్ని ఆస్వాదిస్తూనే మంచి కథల కోసం ఎదురుచూస్తున్నారు. తెలుగమ్మాయిగా మొదలైన శోభిత ప్రయాణం ఇప్పుడు దేశవ్యాప్తంగా, అంతర్జాతీయ స్థాయిలోనూ ప్రత్యేక గుర్తింపు సంపాదించడం అభిమానులకు గర్వకారణంగా మారింది.