హైదరాబాద్, క్రైమ్ మిర్రర్: మెగాస్టార్ చిరంజీవి నుంచి సినీ వారసత్వంతో పాటు క్రమశిక్షణ, అంకితభావాన్ని కూడా అందిపుచ్చుకున్న హీరో రామ్ చరణ్ గురించి ఆయనతో కలిసి పనిచేసిన స్టార్ హీరోయిన్లు చెప్పిన మాటలు ఇప్పుడు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. తెరపై గ్లోబల్ స్టార్గా మెప్పిస్తూనే, వ్యక్తిగతంగా ఎంత వినయంగా ఉంటారో పలువురు హీరోయిన్లు పంచుకున్న అనుభవాలు ఆసక్తిగా మారాయి.
జాన్వీ కపూర్ మాట్లాడుతూ.. తెలుగులో తన రెండో సినిమానే రామ్ చరణ్తో రావడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. అంత పెద్ద స్టార్ అయినా కూడా సెట్స్కు సమయానికి వచ్చి అదే ఉత్సాహంతో పని చేయడం తనను బాగా ఆకట్టుకుందని పేర్కొన్నారు. డాన్స్లో చరణ్ గ్రేస్ అందుకోవాలంటే ఎంతో కష్టపడాల్సి వచ్చేదని నవ్వుతూ చెప్పారు.
తమన్నా కూడా రామ్ చరణ్తో ఉన్న స్నేహాన్ని గుర్తు చేసుకున్నారు. రచ్చ షూటింగ్ ప్రారంభంలో ఆయనతో మాట్లాడటానికే భయపడేదాన్నని, కానీ చరణ్ ముందుగా వచ్చి ఎంతో ఫ్రెండ్లీగా మాట్లాడడంతో ఆ భయం పోయిందని చెప్పారు. తోటి నటీనటుల్ని గౌరవంగా చూసే ఆయన స్వభావం ఎప్పుడూ గుర్తుండిపోతుందని తెలిపారు.
కాజల్ అగర్వాల్ అయితే రామ్ చరణ్తో నాలుగు సినిమాల్లో నటించిన అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు. మగధీర సమయంలో ఆయనతో చేసిన షూటింగ్ ఎప్పటికీ ప్రత్యేకమని చెప్పారు. కొత్త వాళ్లు, సీనియర్లు అనే తేడా లేకుండా అందరితో ఒకేలా మాట్లాడటం చరణ్ ప్రత్యేకత అని పేర్కొన్నారు. చిరంజీవి, చరణ్ ఇద్దరిలోనూ అదే క్రమశిక్షణ కనిపిస్తుందని అన్నారు.
రకుల్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ ధృవ సినిమా కోసం చరణ్ చేసిన మేకోవర్ చూసి ఆశ్చర్యపోయానన్నారు. కొన్ని డాన్స్ సీన్లలో తాను ఎక్కువ టేకులు తీసుకున్నా కూడా ఎక్కడా అసహనం చూపకుండా ఎంతో ఓపికగా ప్రోత్సహించేవారని చెప్పారు.
సమంత మాత్రం రామ్ చరణ్ను రియల్ ఓజీ అని అభివర్ణించారు. రంగస్థలం తమ ఇద్దరి కెరీర్లో ప్రత్యేక చిత్రమని, కష్ట సమయంలో తనకు అండగా నిలిచిన మంచి వ్యక్తుల్లో చరణ్ ఒకరని తెలిపారు.
ఇలా స్టార్ హీరోయిన్లు చెప్పిన మాటలు చూస్తే.. రామ్ చరణ్ కేవలం తెరపైనే కాదు, నిజ జీవితంలోనూ క్రమశిక్షణ, వినయంతో అందరి మనసు గెలుచుకున్న హీరో అని మరోసారి స్పష్టమవుతోంది. ప్రస్తుతం పెద్ది సినిమాతో కొత్త అవతారంలో ప్రేక్షకుల ముందుకు రావడానికి చరణ్ సిద్ధమవుతున్నారు.