హైదరాబాద్, క్రైమ్ మిర్రర్: ఘట్టమనేని కుటుంబం నుంచి మరో హీరో తెలుగు తెరకు పరిచయం అవుతున్నాడు. సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు అన్నయ్య కుమారుడు ఘట్టమనేని జయకృష్ణ హీరోగా నటిస్తున్న శ్రీనివాస మంగాపురం సినిమా రిలీజ్ డేట్ అధికారికంగా ప్రకటించారు. బాలీవుడ్ నటి రాషా తడాని హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే సినీ అభిమానుల్లో మంచి ఆసక్తి నెలకొంది.
అశ్వినీ దత్ సమర్పణలో చందమామ కథలు బ్యానర్పై జెమినీ కిరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్నారు. తిరుపతి బ్యాక్డ్రాప్లో లవ్, యాక్షన్ ఎలిమెంట్స్తో సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, గ్లింప్స్, పాటలు, పోస్టర్లు సినిమాపై మంచి బజ్ తీసుకొచ్చాయి. కృష్ణ జయంతి సందర్భంగా మే 30న చిత్ర బృందం ప్రత్యేక ఈవెంట్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, కృష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావు, ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు, పలువురు సినీ ప్రముఖులు, ఘట్టమనేని అభిమానులు హాజరయ్యారు.
ఈ ఈవెంట్లో హీరో జయ కృష్ణ మాట్లాడుతూ మహేష్ బాబుకి తను పెద్ద ఫ్యాన్ అని, మహేష్ బాబాయి తనకు అన్ని ఫీడ్ బ్యాక్ ఇస్తూ ఉంటారు అని చెప్పారు. ఈ కార్యక్రమంలో నిర్మాత అశ్వినీ దత్ మాట్లాడుతూ కృష్ణ గారితో ఎన్నో సినిమాలు చేశానని, మహేష్ బాబును హీరోగా పరిచయం చేసిన తర్వాత ఇప్పుడు అదే కుటుంబం నుంచి మరో హీరోని ఇండస్ట్రీకి పరిచయం చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. అదే సమయంలో శ్రీనివాస మంగాపురం సినిమాను జూలై 9న థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.
ఘట్టమనేని కుటుంబం నుంచి వస్తున్న కొత్త హీరో కావడంతో జయకృష్ణ ఎంట్రీపై అభిమానుల్లో అంచనాలు పెరిగాయి. ముఖ్యంగా ప్రస్తుతం జూలై 9 తేదీకి మరో పెద్ద సినిమా ప్రకటించకపోవడం ఈ సినిమాకు కలిసొచ్చే అంశంగా కనిపిస్తోంది. అప్పటివరకు అదే పరిస్థితి కొనసాగితే కలెక్షన్స్ పరంగా మంచి అడ్వాంటేజ్ దక్కే అవకాశముందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. మొత్తానికి ఘట్టమనేని కుటుంబం నుంచి వస్తున్న కొత్త హీరో తొలి సినిమా ఎలా ఉంటుందో, జయకృష్ణ ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటాడో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.