హైదరాబాద్, క్రైమ్ మిర్రర్: రెండు తెలుగు రాష్ర్టాల్లో ఎండలు తీవ్రరూపం దాల్చాయి. భానుడి భగభగలు ప్రజలను ఉక్కిరిబక్కిరి చేస్తున్నాయి. దీంతో జనాలు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. మధ్యాహ్నం పూట ఇంట్లోనే ఉండాల్సి వస్తోంది. ఎక్కడ చూసిన రోడ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఎండలతోపాటు వడగాలులు సైతం వీయడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఈ వారం ఎండలు ఇంకా తవ్రంగా ఉంటాయని వాతావరణశాఖ వెల్లడించింది.
ఆంధ్రప్రదేశ్లో…
ఆంధ్రప్రదేశ్లో ఎండలు, వడగాల్పులు ఠారెత్తిస్తున్నాయి. ఎండ వేడితో పాటు వడగాల్పులు, ఉక్కబోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ క్రమంలో ఏపీ ప్రజలకు వాతావరణశాఖ మరోసారి హీట్ వేవ్ అలర్ట్ జారీ చేసింది. బుధవారం కోస్తా, రాయలసీమలో పలుచోట్ల 42 నుంచి 44 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. రాష్ట్రవ్యాప్తంగా 46 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశముందని, 73 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశముందని అంచనా వేసింది. ఈ వడగాల్లులు ఈనెల 18వ రకు ఉంటాయని తెలిపింది.
తెలంగాణలో …
ఏప్రిల్ మాసం సగం కాకముందే తెలంగాణలో కూడా ఎండలు దంచికొడుతున్నాయి. భానుడి ఉగ్రరూపానికి ప్రజలు అవస్థలు పడుతున్నారు. 43 డిగ్రీలను దాటి గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాబోయే మూడు రోజుల్లో 45 డిగ్రీలు దాటే అవకాశముందని హైదరాబాద్ వాతావరణశాఖ హెచ్చరించింది. ఇక మంగళవారం రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో 43 డిగ్రీలు దాటాయి. రాబోయే ఐద్రోజుల్లో మరో 2 నుంచి 3 డిగ్రీలు దాటే అవకాశముంది. మంగళవారం నల్లగొండ జిల్లా అడవిదేవులపల్లిలో 43.5 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది.
ఇక నిజామాబాద్లో 43.3, ఆదిలాబాద్లో 43.2, సిద్దిపేటలో 42.9, కామారెడ్డిలో 42.8, కరీంనగర్లో 42.8, మంచిర్యాల 42.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణశాఖ తన రిపోర్టులో పేర్కొంది. ఉదయం 8 గంటల నుంచే ప్రారంభమవుతున్న ఎండ తీవ్రత సాయంత్రం 4 వరకు ఉంటుంది. ఈ క్రమంలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు బయటకు రాకపోవడం మంచిదని వాతావరణశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. టోపీ ధరించడం లేదా గొడుగు లాంటివి వాడటం చేయాలని చెబుతున్నారు.
