క్రైమ్ మిర్రర్, సెంట్రల్ డెస్క్ : రుణాలు తీసుకునే వారికి ఆర్బిఐ తీసుకువచ్చిన కొత్త నిబంధనలు కొంత ఇబ్బందికరంగా మారనున్నాయి. కొత్త మార్గదర్శకాలను వచ్చే ఏడాది నుంచి అమలు చేసేందుకు ఆర్బిఐ సిద్ధమవుతోంది. ఆర్బిఐ రుణ ధరఖాస్తులకు సంబంధించి కఠిన నిబంధనలను అమలులోకి తీసుకువచ్చేందుకు సిద్ధమవుతోంది. 2027 ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి కొత్త రూల్స్ అమలు చేయడానికి ఆర్బిఐ ఏర్పాట్లు చేసుకుంటుంది. దీనివల్ల సిబిల్ స్కోర్ తక్కువ ఉన్నవారికి రుణాలు తీసుకోవడం ఇక ఇబ్బందికరంగా మారనుంది. రుణాల డిఫాల్టర్లను తగ్గించేందుకు ఆర్బిఐ ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు క్రెడిట్ స్కోర్ 730 కంటే తక్కువగా ఉన్నప్పటికీ రుణాలు పొందే అవకాశం లభిస్తోంది. ఇకపై అటువంటి వారికి రుణాలు తీసుకునే అవకాశాన్ని కల్పించకూడదని ఆర్బిఐ నిర్ణయించింది. ఎక్స్పెక్టెడ్ క్రెడిట్ లాస్ట్ పేరుతో కొత్త రూల్స్ ను ఆర్బిఐ ప్రవేశ పెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. కొత్తగా తీసుకురానున్న నిబంధనలో వల్ల సిబిల్ స్కోర్ 730 కంటే తక్కువ ఉన్నవారికి రుణాలు ఇచ్చే విషయంలో బ్యాంకులో మరిన్ని కఠిన నిబంధనలను అమలు చేయనున్నాయి. క్రెడిట్ హిస్టరీ సరిగ్గా లేకపోయినా, తక్కువగా ఉన్న రుణ దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యేలా నూతన నిబంధనలు ఉండనున్నాయి.
62 శాతం మంది క్రెడిట్ స్కోర్ తక్కువగానే..
ఎక్స్పెక్టెడ్ క్రెడిట్ లాస్ డైరెక్షన్ 2026 ఫ్రేమ్ వర్క్ ను ఆర్బిఐ వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అమలులోకి తీసుకురావాలని భావిస్తోంది. ఇది బ్యాంకింగ్ రంగంలో ఒక కీలకమైన సంస్కరణగా పేర్కొంటున్నారు. ఈ సంస్కరణల ఫలితంగా 730 కంటే తక్కువ సిబిల్ స్కోర్ ఉన్నవారు రుణాలు పొందే విషయంలో కఠినమైన పరిశీలనను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అధిక వడ్డీ రేట్లు, అదనపు పూచికత్తు సమర్పించడం వంటి సమస్యలు ఇకపై రుణాలు కోసం దరఖాస్తు చేసుకునేవారు ఎదుర్కోవాల్సి ఉంటుంది. దేశంలోని రుణ దరఖాస్తుదారుల్లో 62 శాతం మంది ఈ వర్గంలో ఉన్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. బ్యాంకులో రుణ డిఫాల్ట్ లు జరిగిన తర్వాతే స్పందిస్తున్న నేపథ్యంలో కొత్త నిబంధనలు ప్రకారం బ్యాంకులు భవిష్యత్తు డేటాను ఉపయోగించి రుణ గ్రహీత రిస్క్ ను నిరంతరం అంచనా వేసుకునేందుకు అవకాశం లభిస్తుంది. ఈఎంఐ ఆలస్యం చేయడం, అస్థిరమైన ఆదాయ సరళి, క్రెడిట్ వినియోగంలో ఆకస్మిక పెరుగుదల వంటి వాటిని పరిగణలోకి తీసుకొని పూర్తిగా రుణ దరఖాస్తులను తిరస్కరించే అవకాశం కూడా బ్యాంకులకు లభిస్తుంది. ప్రస్తుతం బ్యాంకులో సిబిల్ స్కోర్ తక్కువగా ఉన్నప్పటికీ తమకు నమ్మకమైన కస్టమర్ గా ఎక్కువ కాలంపాటు కొనసాగుతుంటే రుణాలు మంజూరు చేస్తున్నాయి. కానీ, ఈ తరహా రుణాలు మంజూరు విషయంలో కొత్తగా రానున్న నిబంధనలు వారికి ఇబ్బందికరంగా మారనున్నాయి. ఆర్బిఐ కొత్తగా తీసుకువస్తున్న నియమాలు ఇందుకు అనుమతించవని నిపుణులు చెబుతున్నారు.