క్రైమ్ మిర్రర్, తెలంగాణ సినిమా బ్యూరో: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’పై అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ఇప్పటికే విడుదలైన “చికిరి చికిరి”, “రయ్ రయ్ రారా” పాటలు సోషల్ మీడియాలో ట్రెండ్ సృష్టించగా.. ఇప్పుడు మరో సాలిడ్ అప్డేట్ మెగా అభిమానుల్లో జోష్ నింపుతోంది.
తెలంగాణ జానపద సాహిత్యానికి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన ప్రముఖ ఫోక్ రైటర్ మిట్టపల్లి సురేందర్ ఈ సినిమాలో ఓ పవర్ఫుల్ ఫోక్ సాంగ్ రాసినట్లు వెల్లడించారు. ఈ విషయాన్ని ఆయనే సోషల్ మీడియాలో షేర్ చేయడంతో “మన పెద్ది గాడి కోసం సాంగ్” అంటూ అభిమానులు సంబరపడుతున్నారు.
“రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా”, “వాడు నడిపే బండి రాయల్ ఎన్ఫీల్డ్” వంటి పాటలతో తెలంగాణ పల్లె భావోద్వేగాలను అద్భుతంగా చూపించిన మిట్టపల్లి సురేందర్.. ఇప్పుడు ‘పెద్ది’లో కూడా అదే మ్యాజిక్ రిపీట్ చేస్తారని ఫ్యాన్స్ నమ్ముతున్నారు.
ముఖ్యంగా గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఫోక్ బీట్కు థియేటర్లు దద్దరిల్లడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది.
ఈ సినిమాకు సంగీతం అందిస్తున్న ఏఆర్ రెహమాన్ ఇప్పటికే రెండు పాటలతో హైప్ పెంచేశారు. ఇక మిట్టపల్లి సురేందర్ రాసిన జానపద గీతం వస్తే అది మరో లెవెల్లో ఉంటుందని అభిమానులు భావిస్తున్నారు.
ఇక సినిమా ట్రైలర్ను ఈ నెల 18న గ్రాండ్గా విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. భారీ ఈవెంట్తో ట్రైలర్ లాంచ్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అలాగే ప్రత్యేక మ్యూజికల్ ఈవెంట్స్ కూడా ప్లాన్ చేస్తున్నారట.
‘పెద్ది’ సినిమాలో హీరోయిన్గా జాన్వీ కపూర్ నటిస్తుండగా, శివరాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమా జూన్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది.