-
దిల్ రాజుపై మెగా ఫ్యాన్స్ ఫైర్..
-
మెగా సినిమాలప్పుడే సమస్యలా..? అంటూ ఆగ్రహం..!
క్రైమ్ మిర్రర్, తెలంగాణ సినిమా బ్యూరో: తెలంగాణలో థియేటర్ల వ్యవహారం ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. ముఖ్యంగా ‘పెద్ది’ సినిమా రిలీజ్ దగ్గరపడుతున్న సమయంలో థియేటర్ వ్యవస్థపై వచ్చిన వివాదం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. నిర్మాత దిల్ రాజు వర్గంపై మెగా అభిమానులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఇటీవల నిర్వహించిన ప్రెస్ మీట్లో దిల్ రాజు సోదరుడు శిరీష్ రెడ్డి, నిర్మాత సునీల్ నారంగ్ మాట్లాడుతూ.. థియేటర్లను కాపాడాలంటే రెంటల్ విధానం కాకుండా కమిషన్ బేసిస్పై సినిమాలు రన్ చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే మే 29 నుంచి థియేటర్లు బంద్ చేసే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు.
అయితే ఈ వ్యాఖ్యల తర్వాత సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్ మండిపడుతున్నారు. “ఇలాంటి సమస్యలు మెగా హీరోల సినిమాలు రిలీజ్ అయ్యేటప్పుడే ఎందుకు గుర్తుకొస్తాయి?” అంటూ ప్రశ్నిస్తున్నారు. గతంలో పవన్ కళ్యాణ్ ‘హరి హర వీరమల్లు’ సమయంలో కూడా ఇలాంటి పరిణామాలే జరిగాయని గుర్తుచేస్తున్నారు.
ఇప్పుడు రామ్ చరణ్ నటిస్తున్న భారీ చిత్రం ‘పెద్ది’ రిలీజ్కు ముందు థియేటర్ల సమస్యను పెద్దది చేయడం వెనుక వేరే ఉద్దేశాలు ఉన్నాయంటూ కొందరు అభిమానులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా మైత్రీ మూవీ మేకర్స్ సంస్థకు రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరోలు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం కొందరికి నచ్చడం లేదనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి.
ఇంకా కొందరు నెటిజెన్స్ అయితే.. “సంవత్సరం ప్రారంభం నుంచే ఈ సమస్యలు ఉన్నాయి. మరి ఇప్పటి వరకు ఎందుకు పరిష్కారం చూపలేదు? సరిగ్గా ‘పెద్ది’ రిలీజ్ టైమ్లోనే థియేటర్ల పరిస్థితి గుర్తొచ్చిందా?” అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
మరోవైపు థియేటర్ యజమానులు మాత్రం తమ డిమాండ్లు పరిశ్రమ భవిష్యత్తు కోసం అంటూ చెబుతున్నారు. థియేటర్లు నిలబడాలంటే కొత్త విధానం తప్పనిసరి అని వాదిస్తున్నారు.
ఇప్పుడు ఈ వివాదం టాలీవుడ్లో మరింత పెద్ద చర్చగా మారింది. ‘పెద్ది’ విడుదల సమయానికి ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.